జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం-రోడ్లపైకి 4097 చెత్త తరలింపు వాహనాలు-చివర్లో అపశ్రుతి
ఏపీలోని గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా వైసీపీ సర్కార్ రూపొందించిన 'క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)-జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమం ఇవాళ విజయవాడలో ప్రారంభమైంది. సీఎం జగన్ నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 4097 చెత్త తరలింపు వాహనాలను ఆయన ప్రారంభించారు.
వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న'క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)-జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమం లో భాగంగా
ఇవాళ సీఎం జగన్ ఓ సీడీని కూడా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్న ఆశయంలో వైసీపీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉత్తమ ర్యాంక్ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అధికారులు చెప్తున్నారు. ఈ కార్యక్రమం మొత్తం 100 రోజులపాటు కొనసాగనుంది.

విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద అట్టహాసంగా జరిగిన 'క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)-జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్త తరలింపు వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ అనంతరం సిబ్బందితో కాసేపు ముచ్చటించారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని వారిని ఈ సందర్భంగా కోరారు. స్వయంగా సీఎం జగన్ తమతో మాట్లాడటంతో సదరు సిబ్బంది కూడా సంబర పడ్డారు.

ఈ కార్యక్రమం చివర్లో మాత్రం ఓ అపశ్రుతి చోటు చేసుకుంది. సీఎం జగన్ చెత్త వాహనాలను ప్రారంబించగానే ఒక్కసారిగా 4 వేల వాహనాలు బారులు తీరాయి. బెంజి సర్కిల్ నుంచి బయలుదేరి నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లేందుకు బయలు దేరాయి. ఈ సమయంలో ఓ అనుకోని ప్రమాదంతో ఓ వాహనం ముందు భాగంగా ఉన్న అద్దాలు పగిలాయి. ఒక్కసారిగా వాహనాలు కదలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలియగానే అధికారులు రంగంలోకి దిగి సదరు వాహనాన్ని పక్కకు తొలగించారు.












Click it and Unblock the Notifications