అవినాశ్ స్థానంలో ఫైర్ బ్రాండ్ కు జగన్ బాధ్యతలు- కీలక మార్పులు..!?
ఏపీలో కొత్త రాజకీయ వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమిగానే కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసాయి. ఇటు జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు. ఇందు కోసం పార్టీ బలోపేతం దిశగా కీలక నిర్ణయాలకు జగన్ సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయ కర్తలు.. జిల్లా అధ్యక్షులను నియమించిన జగన్.. ఇప్పుడు తన జిల్లా నుంచి మరి కొన్ని మార్పులకు సమాయత్తం అయ్యారు. జిల్లాల పర్యటనలకు ముందే ఈ కసరత్తు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
జగన్ కసరత్తు
మాజీ సీఎం జగన్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయటం పైన కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో రీజియన్ల వారీగా తొలుత సమీక్షలు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ తరువాత తన జిల్లా పర్యటనలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఏపీ లో మారుతున్న రాజకీయ లెక్కలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కూటమి పాలన పైన నియోజకవర్గాల వారీగా జగన్ ఒక ప్రముఖ సర్వే సంస్థ ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు. అదే విధంగా ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నేతల పని తీరు.. అవసరమైన మార్పుల పైన పూర్తి సమాచారం సేకరించారు. దీనికి అనుగుణంగా వచ్చే నెలలో పార్టీ పరంగా కీలక మార్పులకు సిద్దమైనట్లు సమాచారం.

సొంత జిల్లాలో
సొంత జిల్లా కడపలో పార్టీలో చేపట్టాల్సిన నియామకాలు.. మార్పుల పైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి విజయం సాధించిందని జగన్ భావిస్తున్నారు. ఈ ఓటమి కారణంగా తమ పార్టీ కి ఎలాంటి నష్టం లేదని.. నియోజకవర్గంతో సహా జిల్లా ప్రజల్లో టీడీపీ పైనా వ్యతిరేకత వచ్చిందనే అభిప్రాయంతో ఉన్నారు. కాగా.. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బాధ్యతల మార్పు పైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఎంపీగా ఉంటూనే.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో బాధ్యతలను అవినాశ్ పర్యవేక్షిస్తున్నారు. 2024 ఎన్నికల వేళ సునీత - షర్మిల ప్రచారం వేళ.. వివేకా హత్య కేసులో అవినాశ్ ను టార్గెట్ చేసారు.
కీలక మార్పులు
ఇక, ఇప్పుడు అవినాశ్ స్థానంలో పులివెందుల బాధ్యతలను సతీశ్ రెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. గతంలో పలు మార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి వైసీపీలోకి వచ్చిన నాటి నుంచి జగన్ కు పూర్తి విధేయుడిగా ఉంటున్నారు. నియోజకవర్గం పైన పట్టు ఉండటంతో ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అదే సమయం లో అవినాశ్ ను జమ్మలమడుగు.. మైదుకూరు బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. జమ్మల మడుగులో సుధీర్ రెడ్డి ఇంఛార్జ్ గా ఉన్నా.. అక్కడ ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో జగన్ ప్రత్యేకంగా అక్కడ ఫోకస్ చేస్తున్నారు. మైదుకూరు లోనూ పార్టీ మరింత యాక్టివ్ కావాలనే ఉద్దేశంతో ఈ రెండు నియోజకవర్గాలు అవినాశ్ కు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల ఈ మార్పులకు సంబంధించి జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications