వైసీపీ ఐదో జాబితా- ఆ నాలుగు సీట్లలో ఇన్ ఛార్జ్ లు మళ్లీ మార్పు ?
ఏపీలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్లో ఇన్ ఛార్జ్ లను మార్పిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. సదరు ఎమ్మెల్యేలు తాడేపల్లికి వచ్చి అధిష్టానం ప్రతినిధులతో, చివరిగా సీఎంతో చర్చలు జరుపుతున్నారు. అయితే వీటితో పాటు గతంలో వెలువడిన జాబితాల్లో ఖరారు చేసిన పేర్లపైనా అభ్యంతరాలు రావడంతో వాటిని వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలను మార్చి వారి స్ధానాల్లో కొత్త ఇన్ ఛార్జ్ లకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో తమ సిట్టింగ్ స్ధానాలు కోల్పోయిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించారు. పలు చోట్ల బలప్రదర్శనలకు దిగుతున్నారు. తద్వారాతమ బలం నిరూపించుకుంటే అధిష్టానం దిగొచ్చి చివరి నిమిషంలో తమకే సీట్లు కేటాయిస్తుందని భావిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. దీంతో సీఎం జగన్ గతంలో చేసిన పలు మార్పుల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా వెనక్కి తీసుకుంటారని భావిస్తున్న స్దానాల్లో చిలకలూరిపేట, ప్రత్తిపాడు, రేపల్లె, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిలకలూరిపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడదల రజనీని గుంటూరు పశ్చిమ సీటుకు మార్చారు. అలాగే ప్రత్తిపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే సుచరితను తాడికొండకు మార్చారు. రేపల్లెలో ఇన్ ఛార్జ్ గా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్ధానంలో ఈపూరి గణేష్ కు అవకాశం ఇచ్చారు. అలాగే విజయవాడ వెస్ట్ లో సిట్టింగ్ ఎమ్మల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ కు పంపారు.
అయితే ఆయా చోట్ల మార్పులు చేర్పుల తర్వాత పరిస్ధితి మరింత ఇబ్బందికరంగా మారేలా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మరోసారి సమీక్ష చేసి కొత్తగా ఐదో జాబితాలో ప్రకటన చేయొచ్చని అంటున్నారు. దీంతో ఐదో జాబితాలో ఇప్పటికే ఉన్న సీట్లతో పాటు గతంలో ప్రకటించిన జాబితాల్లో ఉన్న పలు సీట్లు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications