వైసీపీలో అధినేత "పట్టు" జారుతోందా : వీర విధేయులే ధిక్కారం : రాజీనామా బాటలో మరో ఎమ్మెల్యే...!!
వైసీపీ పార్టీ - ప్రభుత్వంలో జగన్ ఒన్ మ్యాన్ ఆర్మీ. ప్రభుత్వంలో జగన్ చెప్పగానే మంత్రులంతా రాజీనామా చేసారు. పార్టీ అధినేతగా పూర్తి పట్టు ఉందంటూ ఇప్పటి వరకు భావించారు. కానీ, ఒక్క సారిగా మార్పు కనిపిస్తోంది. సీఎం జగన్ ఏం చెప్పినా చేస్తాం..ఆయనతోనే ఉంటామని చెబుతూ వచ్చిన నేతలే ఇప్పుడు అలకబూనారు. మంత్రి పదవులు ఇవ్వలేదని ఆక్రోశిస్తున్నారు. వారి అనుచరులు రోడ్ల పైకి వచ్చారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. మంత్రి పదవులు ఆశించిన నేతల అనుచరులు పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు వైసీపీలో కొత్త రచ్చకు కారణమైంది.

మెత్తబడని బాలినేని..మద్దతుగా
సీనియర్ నేత బాలినేని సైతం అలక బూనారు. ఆయనను బుజ్జగించేందుకు రెండు సార్లు సజ్జల ఆయన నివాసానికి వెళ్లారు. కానీ, బాలినేని మెత్తబడలేదు. బాలినేనికి మద్దతుగా ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, కౌన్సిలర్లు కూడా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సైతం ఈ రోజు రాజీనామా చేస్తానని వెల్లడించారు. మరో సీనియర్ నేత పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి సైతం ఆగ్రహంతో ఉన్నారు. నర్సరావు పేట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అంబటి.. విడదల రజనీకి అవకాశం దక్కింది. స్థానిక - మున్సిపల్ ఎన్నికల్లో పిన్నెళ్లి పార్టీని ఏకపక్షంగా- ఏకగ్రీవంగా గెలిపించారు. కానీ, తనకు ప్రాధాన్యత దక్కకపోవటంతో సీఎంఓ నుంచి ఫోన్ వచ్చినా స్పందించలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ధిక్కారస్వరం వినిపించారు.

ఎస్సీ మంత్రుల్లో సుచరిత మినహా
గత మంత్రివర్గంలోని ఎస్సీ మంత్రులందర్నీ కొనసాగించి తననే తప్పించడంపై మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుచరిత అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారని ఆమె కుమార్తె వెల్లడించారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆవేదనతో కంటతడి పెట్టుకున్నారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో ఆయన అనుచరులు రోడ్డెక్కారు. జగ్గయ్యపేటలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అనుచరులు ప్రకటించారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి నిరసనగా ఆత్మకూరు పురపాలక సంఘం కౌన్సిలర్లు అయిదుగురు వారి పదవులకు రాజీనామా చేశారు.

వీర విధేయుల నుంచే నిరసనలు
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మంత్రిపదవి ఇవ్వనందుకు నిరసనగా అనుచరులు ఆందోళనకు దిగారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చిన పార్ధసారధి అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించి ఆందోళనను విరమింపజేశారు. పార్టీ తనకు న్యాయం చేస్తుందని భావించానని, కానీ సమీకరణాల్లో తనకు న్యాయం జరగలేదన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు మంత్రి పదవిని కేటాయించాలని అనుచరులు ఆందోళనకు దిగారు.

ఆశించి..భంగపడటంతో ఆక్రోశం
అయితే, పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. మంత్రి వర్గంలో 25 మందికే అవకాశం ఇవ్వగలమని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల చెప్పుకొచ్చారు. ఆశావాహులు పదవులు ఆశించి..రాకపోవటంతో వారి అనుచరులు కొంత అసహనానికి లోనవటం సహజమన్నారు. అయితే, సీఎం జగన్ కు వీర విధేయులుగా ఉన్న వారే ఇలా బహిరంగంగా నిరసన వ్యక్తం చేయటం ద్వారా వైసీపీలో కొత్త చర్చ మొదలైంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా మార్పులు ప్రారంభించిన సీఎం జగన్ కు ..తొలి నిర్ణయంలోనే ఇలా ధిక్కారం కనిపించటంతో..ఇక, రానున్న రోజుల్లో పార్టీ అధినేతగా జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాళఊరనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications