అవకాశం వస్తే వెంటనే బాబు ప్రభుత్వంపై జగన్ అవిశ్వాసం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డారు. రేపు లేదా ఎల్లుండి ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తనకు ప్రసంగించే అవకాశం వస్తే తన ప్రసంగం ముగిసిన వెంటనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
అమరావతి భూదందాపై ప్రస్తుతం అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత శనివారంనాడు శానససభ మంగళవారానికి వాయిదా పడింది. రేపటి నుంచి (మంగళవారం నుంచి) శాసనసభా సమావేశాలు వాడిగా వేడిగా సాగే అవకాశం ఉంది.
అమరావతి భూదందా ప్రధానంగా శానససభలో వేడి రాజేసే అవకాశం ఉంది. శాసనసభా సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మధ్య కాలంలో 16 పని దినాలున్నాయి.