జగన్ నోట మరోసారి ఓటుకు నోటు కేసు: బయట పడేందుకే చంద్రబాబు మౌనం
మచిలీపట్నం: ఓటుకు నోటు కేసు నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయటపడేందుకే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు వైయస్ జగన్ ఆరోపించారు.
కొద్ది సేపటి క్రితం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పేందేమిటి? ఇప్పుడు చేసేందేమిటన్ ఆయన ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు గురించి కేంద్రంతో మాట్లడుకోవడం వల్లే చంద్రబాబు మౌనంగా ఉన్నారని, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయడం లేదని ధ్వజమెత్తారు.
ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ప్రధానితో చంద్రబాబు ఏమీ మాట్లాడలేదని అందరికీ అర్ధమైందని అన్నారు. మంగళవారం ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై మాట్లాడకపోవడాన్ని వైయస్ జగన్ తప్పుబట్టారు. ప్రత్యేకహోదా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కని, ఎలాగైనా దానిని సాధించుకుందామని ఆయన తెలిపారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైయస్సార్దేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీయూడబ్ల్యూజే ముగింపు మహాసభకు హాజరయిన ఆయన మాట్లాడారు. రాజకీయ వ్వవస్థను మార్చగలిగే, శాసించే సత్తా జర్నలిజానికి మాత్రమే ఉందని ఆయన అన్నారు.
విలేకరులతో ఎప్పటికీ విభేదాలు ఉండవని, ఉండొద్దని తన తండ్రి, ఆ దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ చెప్పిన సంగతిని వైయస్ జగన్ గుర్తు చేసుకున్నారు. రాబోయే కాలంలో కూడా వైయస్సారే స్ఫూర్తి అని, జర్నలిస్టులపై వైయస్సార్కు ఎలాంటి అభిప్రాయం ఉండేదో తనకూ అలాంటి అభిప్రాయమే ఉందని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడు తీరుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ను టీడీపీ, బీజేపీ మోసం చేశాయని అన్నారు. దొంగతనానికి పాల్పడిన వారిపై సైతం 420 కేసులు పెడుతున్నారని.. అలాంటప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబునాయుడిపై ఎలాంటి కేసులు పెట్టాలని జగన్ ప్రశ్నించారు.
అసలు ఇలాంటి వారిని సరిగా ప్రశ్నించగలుగుతున్నామా అని అన్నారు. మనందరికీ ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నించగలిగినప్పుడే అన్ని సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుందని వైయస్ జగన్ చెప్పారు. ఈ నెల 29న ఇచ్చిన బంద్ పిలుపు తన కోసమో, తన కుటుంబం కోసమో కాదని, యావత్ ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్ కోసమని గుర్తు చేశారు.
ఈ బంద్ను విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరుండి కుట్రలు చేస్తారని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆ రోజూ బంద్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.