ఇదేమిటని జగన్ అభ్యంతరం: సీఎంగా వందల ప్రకటనలు చేశానని బాబు
హైదరాబాద్: 15 నిమిషాల వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాపై చర్చ మొదలైంది. సోమవారం తాను మధ్యలోనే ఆపేసిన స్టేట్మెంట్ను కొనసాగిస్తున్న చంద్రబాబు, స్టేట్మెంట్లో ఉన్న విషయాన్ని వదిలేసి చర్చకు వెళ్లడాన్ని ప్రతిపక్ష నేత జగన్ ఆక్షేపించారు.
ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ 'ఆయన ఏదేదో చెబుతున్నాడు, మేం వింటున్నాం. నోట్ అనే ముసుగులో చర్చ ఎందుకు నడిపిస్తున్నారు' అని అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రకటన కొనసాగించిన సీఎం చంద్రబాబు విభజన సమయంలో జరిగిన వాటి గురించి చెబుతుండడంతో జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
'ప్రత్యేక హోదా గురించి చెప్పమంటే చరిత్ర చెబుతున్నారు. నోట్ అంటే అర్థముంది, స్టేట్ మెంట్ అంటే అర్థముంది.. కానీ ఇప్పుడు చేసేదానికి అర్థం లేకుండా పోతోంది. చంద్రబాబు ఏం చెబుతున్నారో, నోట్ ఎందుకిచ్చారో ఒక్క రవ్వ కూడా అర్థం కావట్లేదు. కావాలంటే నోట్ పక్కన పెట్టేద్దాం. చర్చ చేద్దాం' అని వైఎస్ జగన్ అన్నారు.
దీంతో జగన్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తనకు అన్ని విషయాలూ తెలుసునని, తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన వారు నిబంధనలు తెలుసుకురావాలని అన్న చంద్రబాబు, "నేను స్టేట్ మెంటు మాత్రమే ఇస్తే, ఆపై చర్చకు అవకాశం ఉండదు. కేవలం క్లారిఫికేషన్ మాత్రమే మీరు అడగాల్సి వుంటుంది. ఓకేనా?" అని కోపంగా ప్రశ్నించారు.
విభజన జరిగిన తీరును, ఆనాడు ఇచ్చిన హామీలు, ఆపై చట్టం అమలవుతున్న తీరు తదితరాలను పూర్తిగా సభ ముందు ఉంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సభలో చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్నట్టు వివరించారు. సభకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ముందుగా నోట్ సమాచారం ఇస్తామని అన్నారు.
దానిపై సభ్యులకు అవగాహన కల్పించాల్సి ఉంటుదని చెప్పిన బాబు, నా ప్రకటన తర్వాత ఆయన మాట్లాడొచ్చని అన్నారు. ఇది మంచి పద్దతి కాదని అన్నారు. ఏపీని విభజించిన తర్వాత రాష్ట్రం ఆవేదనతో, ఆలోచనతో సభను చూస్తున్నారు. ప్రజలకు జవాబూదారీ ఉన్నాను కాబట్టే ప్రజలకు తెలియజేస్తున్నానని అన్నారు.
ప్రత్యేకహోదా సబ్జెక్టుపై నేను సీరియస్గా ఉన్నా, ఆవిషయాన్ని ప్రతిపక్ష నాయకుడు, సభ్యులు అర్థం చేసుకోవాలన్నారు. సభలో మీకు చర్చ కావాలా, ప్రకటన కావాలా అని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా సీఎంగా ఉన్నా, అసెంబ్లీలో వందల వేల ప్రకటనలు చేశానని అన్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని చెప్పిన ఆయన ఇష్టానుసారం వ్యవహరించడం సరి కాదని సూచించారు. రాష్ట్ర సిఎంగా ప్రత్యేక హోదాతో పాటు మరికొన్ని విభజన చట్టంలో పెట్టారు.