ఇప్పటినుంచే వదిలించుకుంటే మంచిది కదా!!
రానున్న ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. అయితే ఆయనకు అన్నింటికన్నా ఎక్కువ తలనొప్పిగా మారిన విషయం.. ఆశావహులు. అధికారంలో ఉండటంతో ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు కూడా సీటు కోసం పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాగూ టికెట్ దక్కలేదు.. ఈసారైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్నవారు కోకొల్లలుగా ఉన్నారు.

సమన్వయకర్తల నియామకం
వీరిలో తలనొప్పిగా ఉన్నవారిని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించకుండా ఇప్పటి నుంచే వదిలించుకుంటేనే మంచిదన్న భావనలో జగన్ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు సమన్వయకర్తను కూడా నియమించారు. ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వారు బాగా పనిచేస్తారనే ఉద్దేశంతో పోటీగా సమన్వయకర్తను నియమించారు. దీంతో సీట్ల కోసం ఎమ్మెల్యేతోపాటు వీరి నుంచి కూడా జగన్ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది.

కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్
ఎవరు బాగా పనిచేస్తున్నారు? ఎవరు పనిచేయడంలేదు? రానున్న ఎన్నికలను ఎవరైతే సమర్థవంతంగా ఎదుర్కోగలరు? తదితర అంశాలను క్రోడీకరిస్తున్నారు. వీటితోపాటు రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న ఐప్యాక్ ఇచ్చే నివేదికను పరిశీలనలోకి తీసుకుంటున్నారు. ఎవరెవరివల్ల పార్టీకి నష్టం కలుగుతోంది? అన్న విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. ఇటీవలే పొన్నూరులో రావి వెంకటరమణను, పామర్రులో డీవై దాస్ ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేశారు.

రఘురామతో ఉన్న తలనొప్పినే భరించలేకపోతున్నాం..
పొన్నూరులో ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో పీకే నివేదిక ప్రకారం రావిని పక్కనపెట్టి రోశయ్యకు సీటిచ్చారు. ఆ తర్వాత ఈ రెండువర్గాల మధ్య తరుచుగా కీచులాటలు జరుగుతుండటంతో రావిపై వేటువేశారు. అలాగే పామర్రులో డీవై దాస్ రాబోయే ఎన్నికల్లో తనకు సీటు కావాలని తరుచుగా ఒత్తిడి తెస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ కైలే అనిల్ కుమార్ కు ఇచ్చారు. ఈ తరహా నేతల్ని ఎన్నికల వరకు ఉపేక్షిస్తే రెబల్ అభ్యర్థులుగా తయరావుతారని, ఇప్పటికే రఘురామకృష్ణరాజు రూపంలో ఎదుర్కొంటున్న తలనొప్పినే భరించలేకపోతున్నామని పార్టీ యోచిస్తోంది. దీంతో ఇటువంటివారిని పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారు.












Click it and Unblock the Notifications