జగన్ కడప టూర్-కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభం-సెంచరీ ఫ్లై పరిశ్రమ శంఖుస్ధాపన
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ తన సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం కడప జిల్లాకు వచ్చిన సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అదే సమయంలో మరికొన్ని కొత్త కార్యక్రమాలకు శంఖుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా వీటిలో పాల్గొన్నారు.
బద్వేలులో జగన్
ఇవాళ కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్టుకాలనీ 1 లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేశారు. అలాగే బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్ధాపన చేశారు. అనంతరం మెస్సర్స్ సెంచరీ ప్లై పరిశ్రమకు జగన్ శంకుస్ధాపన చేశారు. బద్వేలు లాంటి చాలా వెనుకబడి ఉన్న ప్రాంతంలో సెంచరీ ఫ్లై వంటి మంచి సంస్ధ రావడం.. రూ.1600 కోట్ల పెట్టుబడితో 2500 మందికి నేరుగా ఉపాధి కల్పించడం చాలా సంతోషమని జగన్ తెలిపారు. పరోక్షంగా మరో 5 వేల మందికి కచ్చితంగా ఈ కంపెనీ ఉపాధి కల్పించే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ ప్లాంటు కలప మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి... కడప జిల్లానే కాకుండా ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఉన్న సుబాబుల్ సాగు చేసే రైతుల పంటలకు కూడా గిట్టుబాటు ధర అన్నది కచ్చితంగా ఇవ్వగలిగే పరిస్థితుల్లోకి ప్రభుత్వం పోతుందన్నారు. అలాగే అనుబంధ పరిశ్రమలు కూడా ఇక్కడకు వచ్చి.. తద్వారా ఇంకా ఎక్కువమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.
కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభం
అనంతరం బద్వేలు నియోజకవర్గంలోని సీకే దిన్నె మండలంలోని వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ను సీఎం జగన్ ప్రారంభించారు. తర్వాత వైఎస్సార్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్క్లేవ్ వద్ద ఏర్పాటుచేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు.
వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ యూనిట్ ను జగన్ ఇవాళ ప్రారంభించారు.ఈ మెగాపారిశ్రామిక హబ్తో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీని కూడా, ఈ హబ్లో సదుపాయాలను ఇవాళ ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని జగన్ తెలిపారు.. 540 ఎకరాలలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ , మరో 3వేల 167 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈరెండింటిలో పెట్టుబడి పెట్టేది మౌలికవసతులు కల్పించడానికి టోటల్గా రోడ్లు, విద్యుత్ సరఫరా, ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణం 1580కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దీనికోసం ఇప్పటికే వందకోట్ల రూపాయలను ఖర్చుచేయడం జరిగిందని జగన్ తెలిపారు. నాలుగు షెడ్లతో ఇప్పటికే ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ ఇక్కడికి రావడం జరిగిందన్నారు.. 1800మందికి ఇక్కడ ఉపాధి ఇవ్వబడుతుందని సీఎం పేర్కొన్నారు. 50మంది చెల్లెమ్మలకు జాయినింగ్ ఆర్డర్స్ కూడ ఇవ్వడం జరిగిందన్నారు. వాళ్లందరు ట్రైనింగ్ పూర్తైన తర్వాత ఇక్కడే పనిచేయడం జరుగుతుంది.
కడపలో మరిన్ని పరిశ్రమలు
ఇవాళ ప్రారంబమైన వాటికి అదనంగా మరో ఆరు ఎలక్ట్రానిక్ సంస్థలు గ్రౌండ్ బ్రేకింగ్కు సిద్ధంగా ఉన్నాయిని సీఎం జగన్ వెల్లడించారు. ఇందులో ఈఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ఒకటి, రెండోది డిజికాన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి మూడోది సెల్కాన్ రెజుల్యూట్ సంస్థ చంద్రహాస్ ఎంటర్ ప్రైజెస్ నాలుగోది, యూటీఎన్పీఎల్ ఐదోది, డిక్సన్ రెండో ప్లాంట్ కూడ పెడుతున్నారు. ఈ ఆరు సంస్థలు దాదాపు 600కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి, దీనికి ఇవాళ శిలాఫలకాలు వేస్తున్నామన్నారు. వీటితో దాదాపు 7వేల 500 ఉద్యోగాలు రాగల 6నుంచి 9నెలల కాలంలో ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వీవీడీఎన్ అనే మరో సంస్థ కూడా ఇక్కడ 365కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈఒక్క సంస్థ ద్వారానే 5వేల 400 ఉద్యోగాలు రాబోతున్నాయి. 6 నుంచి 9నెలల కాలంలో రియలైజ్ అయ్యే కార్యక్రమం జరుగుతోందన్నారు. బ్లాక్ పెప్పర్, హార్మోని సిటీ అనే మరో రెండు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడ ఆసక్తి చూపుతున్నాయని జగన్ తెలిపారు. టీవీలు, లాప్టాప్లు, ఐఎటీ డివైజ్లు , ట్యాబ్లెట్స్ తయారీ ఈ పార్క్ లోనే జరుగబోతోందని వెల్లడించారు.