నూతన సభలో జగన్ మైక్ కట్ చేశారు: వైసీపీ ఆందోళన, పోడియం వద్ద నిరసన
పోలవరం అంశంపై చర్చ చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేయడంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే పోలవరంపై చర్చకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టార
అమరావతి: పోలవరం అంశంపై చర్చ చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేయడంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే పోలవరంపై చర్చకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ఈ అంశానికి సంబంధించి మంత్రి దేవినేని కొన్ని అంశాలు సభ ముందుంచినా వారు సంతృప్తి చెందలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ చేపట్టడం సరికాదని స్పీకర్ చెప్పినా వారు వినిపించుకోలేదు.
పోలవరం ప్రాజెక్ట్ చట్టప్రకారం ఏపీకి రావాల్సిన హక్కని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్ట్పై చంద్రబాబు సర్కారు గొప్పలు చెప్పుకుంటూ తమ ప్రభుత్వ కృషి వల్లే వచ్చినట్లు పేర్కొంటుందని మండిపడ్డారు.
విభజన సమయంలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్గా గుర్తించారని, ముంపు మండలాలను రాష్ట్రంలో కలుపుతూ చట్టంలో పొందుపర్చారని అన్నారు. మూడేళ్లలో రూ.3వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. అయితే, జగన్కు ప్రభుత్వం సమాధానం చెప్పే నేపథ్యంలో కాసేపు వాగ్వివాదం చెలరేగింది.
'మీరు మంత్రులుగా ఉండడమే రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం.' అంటూ అధికార పక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం ఏపీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడిన తర్వాత మరోసారి వైయస్ జగన్ మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన మైక్ కట్ అయింది. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి నిరసన వ్యక్తం తెలిపారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.