జగన్ నెక్ట్స్ ప్లాన్ రెడీ- 28 నుంచి మూడు ప్రాంతాల్లో ..!
ఏపీలో వచ్చే ఎన్నికలను చావోరేవోగా భావిస్తున్న సీఎం వైఎస్ జగన్ తుది విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే గత ఏడాది కాలంలో గడప గడపకూ వైసీపీ పేరుతో పార్టీ నేతల్ని, శ్రేణుల్ని సన్నద్ధం చేసిన జగన్, అనంతరం ప్రాంతాల వారీగా సిద్ధం సభలో క్యాడర్ లో ఉత్సాహం నింపారు. అనంతరం మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు వ్యాప్త నిర్వహించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చివరిగా ప్రాంతాల వారీగా సభల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ఇవాళ పార్టీ కీలక నేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించారు. ఇందులో ఆయన.. రాష్ట్రంలో తాజా పరిస్దితులపై నేతలతో చర్చించారు. అనంతరం రాష్ట్రంలో చివరి విడత ప్రచారానికి ప్లాన్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ ప్రతీ రోజూ రోజుకో సభ చొప్పున 15 రోజుల పాటు విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు.

ఈ నెల 28 నుంచి వైఎస్ జగన్ సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ రోజూ మూడు ప్రాంతాల్లోనూ ఒక్కో సభ చొప్పున మొత్తం మూడు సభలు నిర్వహించేలా జగన్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28న తాడిపత్రి, కందుకూరు, వెంకటగిరిలో సభలు ప్లాన్ చేశారు. అనంతరం ఏప్రిల్ 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో సభలు నిర్వహిస్తారు. ఇలా 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సభల నిర్వహణకు ప్లాన్ సిద్ధమైంది.












Click it and Unblock the Notifications