బాబు & టీంకు జగన్ అభినందన: టిపై మొత్తుకున్నాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసన సభ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడిపించిన ఎపి సిఎం చంద్రబాబుకు, మంత్రులకు, ఇతర నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈసారి ఎన్నికలు కాంగ్రెసు పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని, పోరు ప్రతిపక్షాలైన టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్యనే జరిగిందన్నారు.
రుణమాఫీ, మోడీ గాలి వల్ల టిడిపి గెలిచిందన్నారు. ప్రతిపక్షం అంటే ప్రతిదీ విమర్శించడం కాదని అన్నారు. ఆ సంప్రదాయం నుండి తాము బయటకు రాదల్చుకున్నామన్నారు. అధికార పార్టీకి తమ సహాయ, సహకారాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. అప్పుడు తాము సహకరిస్తాన్నారు. మీరు అభివృద్ధి చేస్తే తాము సహకరిస్తామన్నారు.
అధికార పక్షాన్ని విమర్శించడం తమ పని కాదన్నారు. ప్రతి పేదవాడికి మేలు జరగాలని వైయస్ రాజశేఖర రెడ్డి ఆశించారన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రం అధ్వాన్నంగా తయారయిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పడం సరికాదన్నారు. సాధారణంగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చంద్రబాబుకు ముందు రాష్ట్రంలో 53 మార్కులు వస్తే, చంద్రబాబు హయాంలో 56 మార్కులు వస్తే.. గత పదేళ్లుకు 82 మార్కులు వచ్చాయన్నారు.
విభజన సమయంలో టిడిపి ఇచ్చిన లేఖను వెనక్కి ఇవ్వాలని మొత్తుకున్నామన్నారు. అన్నింటికంటే బాధాకరమైన విషయమేమంటే ఎపికి అన్యాయం జరుగుతుందని తెలిసినా బిల్లుకు మద్దతివ్వడం బాధాకరమన్నారు. అదే బిల్లుకు ఓటేయడం తమను బాధిస్తోందన్నారు. అర్హులందరికీ పింఛన్లు ఇచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిదే అన్నారు.