అదే నాకు కిక్కిస్తోంది: ‘బజార్లో దొరికిన బూట్లే’ అంటూ నవ్వేసిన జగన్
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. పర్యటన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ఆయన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు సర్కారు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవని మూడు జిల్లాల్లో రైతులు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయానని జగన్ అన్నారు.
రాక్షస పాలన, అంతా అవినీతే చంద్రబాబుపై జగన్ నిప్పులు
'రైతు దగ్గర కిలో టమోటాలను రెండు రూపాయలకో మూడు రూపాయలకో కొంటున్నారు. అవే టమోటాలను ఏ హెరిటేజ్కు దళారీలు అమ్మితే కిలో టమోటాలు నలభై రూపాయలు. ఇలాంటి విషయాలు చంద్రబాబునాయుడుకి తెలియక కాదు. చంద్రబాబునాయుడు గారే దళారీగా మారి..దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. రైతులకు ఈ విషయం తెలిసినా తమ కర్మ అని, ప్రభుత్వ వైఫల్యమని సరిపెట్టుకుంటున్నారు. సుమారు నాలుగేళ్లలో పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేదు! శ్రీశైలంలో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి కానీ, రాయలసీమలో ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదు! అన్ని వర్గాల వారిని చంద్రబాబునాయుడు మోసం చేశారు. ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు' అని జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు చేసిన పెద్ద తప్పు
ఇంతకుముందు రైతులకు, మహిళలకు సున్న లేదా పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందేవి. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాకా వడ్డీ డబ్బులను బ్యాంకులకు కట్టడం మానేశారు. చంద్రబాబు చేసిన పెద్దతప్పుల్లో ఇది ఒకటి. ఉపాధి హామీ పనులు సవ్యంగా జరగట్లేదు. మా నాయన హయాంలో.. కూలీలకు వేతనంగా 97 శాతం నిధులు వెళ్లేవి. ఇలాంటి విషయాలను ప్రజలు చెబుతున్నారు కాబట్టే నాకు తెలుస్తున్నాయి' అని జగన్ చెప్పుకొచ్చారు.
బాబు, జగన్ ముఖం చూసి రారు..
‘ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే చంద్రబాబు మొఖం చూసో, తన ముఖం చూసో యువతకు ఉద్యోగాలు ఇవ్వరని వైసీపీ అధినేత జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఓ ఫ్యాక్టరీ కట్టాలన్నా, ఓ హోటలు కట్టాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా ఇన్ కం ట్యాక్స్, జీఎస్టీ చెల్లించాల్సిన పని లేదంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. అంతేగానీ, చంద్రబాబు ఫేస్ బాగుందనో, జగన్ ఫేస్ బాగుందనో వారు ముందుకు రారు. ప్రత్యేక హోదా సౌకర్యం వుంటే వారు ముందుకు వస్తారు. ప్రత్యేక హోదా సంజీవని అని, ప్రత్యేక హోదా పదేళ్లు, పదిహేనేళ్లు కావాలని నాడు చంద్రబాబు నాయుడే అన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట మార్చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. టౌన్లలో ఉన్న ప్రజలకు ఈ విషయం బాగా అర్థమవుతుంది' అని ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో జగన్ చెప్పుకొచ్చారు.
45ఏళ్లకే పెన్షన్ ఎందుకంటే..
తాను అధికారంలోకి వస్తే ‘నలభై ఐదేళ్లకే పెన్షన్' ఇస్తానని జగన్ తన పాదయాత్రలో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన తాజా స్పందిస్తూ ‘నా పాదయాత్ర ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు ధర్మవరం వెళ్లాను. అప్పుడు చేనేత కార్మికులు 37 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్లిన రోజున మహిళా చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ వాస్తవం ఓ ఉద్వేగానికి కారణమైంది. నలభై ఐదేళ్లకు పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం అప్పుడే తీసుకున్నాను. చేనేత కార్మికులు, మత్స్యకారులు, పంట పొలాల్లో పని చేసే వారు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద వర్గాల ప్రజలే. వీళ్లందరూ పేదోళ్లే. కడుపు నిండాలంటే పనిలోకి పోవాల్సిందే. ఇటువంటి వాళ్లు పని చేసీ చేసీ నలభై ఐదేళ్లు వచ్చేసరికే.. వారిలో పని చేసే సామర్థ్యం తీవ్రంగా తగ్గిపోతుంది. ఒక వారం రోజుల పాటు వీళ్లు అనారోగ్యానికి గురైతే పనిలోకి వెళ్లలేరు.. పస్తులుండాల్సిన పరిస్థితులు. ఇటువంటి వాళ్లకు నలభై ఐదేళ్లకే రూ.2000 పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. అదేమీ నాకు తప్పనిపించలేదు. ఇది కూడా చేయలేకపోతే మానవత్వం అనిపించుకోదు అని నాకు అనిపించింది' అని జగన్ వివరించారు.
బజార్లో దొరికిన బూట్లే..
తాను బజార్లో దొరికే బూట్లను ధరించే నడుస్తున్నానని, వాటికి ఎటువంటి ప్రత్యేకతలు లేవని ఓ ప్రశ్నకు సమాధానంగా జగన్ చెప్పారు. ‘అందరూ ధరించే బూట్లను నేను వాడుతున్నా. కాకపోతే, కొంచెం క్వాలిటీ ఉన్నాయి' అంటూ జగన్ నవ్వేశారు.
అదే నాకు కిక్కిస్తోంది..
‘కచ్చితంగా జగన్ ఏదో చేస్తాడు, మాకు భరోసా ఇవ్వడానికి ఎండలో తిరుగుతున్నాడు, ఈరోజు కాకపోయినా జగన్ మంచి చేసే పరిస్థితి ఉంటుంది' అనేది దేవుడి దయవల్ల ప్రజల్లో ఉంది. ‘ఏదో ఓ రోజున దేవుడు, మనం జగన్ ని ఆశీర్వదిస్తాం..కచ్చితంగా ఆ రోజున జగన్ మనకు మేలు చేస్తాడు' అనే నమ్మకం ప్రతి వర్గంలో కనిపిస్తోంది. అదే నన్ను నడిపిస్తోంది..అదే నాకు కిక్ ఇస్తోంది. ప్రజల్లో ఉన్న ఆ నమ్మకం చూస్తుంటే, వారికేదైనా కచ్చితంగా చేయాలనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి అనేది కోట్ల మంది ప్రజల్లో ఒకరికే దేవుడు ఇస్తాడు. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మంచి చేయాలంటే.. రేపు మనం ఉన్నా? లేకపోయినా? ప్రతి ఇంట్లో మన ఫొటో ఉండాలి.. ప్రతి గుండెలోను మనం బతికే ఉండాలి' అని చెప్పుకొచ్చారు.
బొబ్బలు సాధారణమే.. సిద్ధమయ్యే..
వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసేటప్పుడు కాళ్లకు బొబ్బలు రావడం సహజమేనని, ఆ బొబ్బలకు బ్యాండేజ్ వేసేసి నడిచేస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ‘కాళ్లకు వచ్చిన బొబ్బలకు బ్యాండేజ్ వేసేస్తా. ఆ బొబ్బే గట్టిగా అయిపోతుంది..అలానే నడిచేస్తా. ఇలాంటి వాటికి మానసికంగా సిద్ధమయ్యాను కాబట్టే పాదయాత్ర చేస్తున్నా.
ప్రజలు తిరిగే సమయంలో చంద్రబాబునాయుడు నాడు పాదయాత్ర చేయలేదు. పగటి పూట చేయలేదు. నాలుగు గంటలకు మొదలుపెట్టి ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకో, రెండు గంటలకో చంద్రబాబు తన పాదయాత్రను ముగించేవారు. ప్రజలతో ఆయనకు పనిలేదు!..దటీజ్ చంద్రబాబునాయుడు! నాన్న పాదయాత్ర పగటిపూటే చేశారు.. నేను కూడా పగటి పూటే చేస్తున్నాను. పగటిపూట పాదయాత్ర చేస్తేనే ప్రజలకు మనం దగ్గర కాగలుగుతాం. వాళ్ల సమస్యలు వినగలుగుతాం, కష్టాలను చూడగలుగుతాం. పగటిపూట పాదయాత్ర చేస్తేనే వాళ్లు కూడా మనల్ని కలిసే అవకాశం ఉంటుంది. అందరూ నిద్రపోయిన తర్వాత పాదయాత్ర చేస్తే డిస్టెన్స్ కవర్ అవుతుందేమోగానీ, ప్రజల సమస్యలు తెలుసుకోలేం' అని జగన్ పేర్కొన్నారు.