వైఎస్సార్ అవార్డుల్ని ప్రదానం చేసిన జగన్-గవర్నర్, విజయమ్మ హాజరు- ఎందుకిస్తున్నామంటే..
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ -2022 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. వరుసగా రెండో ఏడాది అవార్డుల ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైయస్.జగన్, ఆత్మీయ అతిథిగా వైయస్.విజయమ్మ హాజరయ్యారు.
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులకు (౩౦ సంస్ధలకు) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్.జగన్ అవార్డులు అందజేశారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం, మహిళా శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్ధలకు 20 వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 10 వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు అందజేశారు.
సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు, అసామాన్య సేవలందిస్తున్న మానవతా మూర్తులకు వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్సార్ అచీవ్మెంట్, వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ అవార్డులను వ్యక్తులుగా, సంస్ధలగా వారు చేసిన గొప్ప పనులకు ప్రదానం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ అవార్డులు తమ శ్రమతో, స్వేదంతో మనరాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలకు ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో ఇస్తున్నామన్నారు. ఈ అవార్డులు మన సంస్కృతి, సాంప్రదాయాలకు దశాబ్దాలుగా వారధులుగా ఉన్నవారికి ఇస్తున్నట్లు జగన్ తెలిపారు.
ఈ అవార్డులు మన మహిళా రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారధులకు ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.ఈ అవార్డులు వెనుకబాటు మీద, అణిచివేత మీద, పెత్తందారీ పోకడల మీద దండయాత్ర చేస్తున్న సామాజిక ఉద్యమకారులకు, భిన్నమైన కళాలకు, గళాలకు, పాత్రికేయులకు ఈ అవార్డులు ఇస్తున్నామన్నారు. ఈ అవార్డులు మన గడ్డమీద పుట్టి, వైద్య ఆరోగ్యరంగంలో మనిషి ప్రాణాలు నిలబెట్టడంలో అంతర్జాతీయ కీర్తి గడించిన మహామహులకు, అంతర్జాతీయంగా కీర్తి గడించిన మన పారిశ్రామిక దిగ్గజాలకు.. మనం ఈరోజు ఆందరిలో కొందరిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తున్నామన్నారు.
జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 నెలల కాలంలో తాను ఆచరించి చూపిన రైతు పక్షపాత, మహిళా పక్షపాత, నిరుపేద పక్షపాత విధానాలకు, సామాజిక న్యాయానికి, ప్రాంతీయ న్యాయానికి, వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవానికి, మనదైన తెలుగుదనానికి, మన కళలు, సాంప్రదాయాలకు, మన శ్రమకు, పరిశ్రమకు వైఎస్సార్ ను గుర్తు చేసుకుంటూ ఈ అవార్డులు ఇస్తున్నట్లు జగన్ వెల్లడించారు. ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ జగన్ హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.