బాబూ! ఒక్క ప్రశ్న.. సిగ్గుండాలి, జగన్ చేసినా తప్పే: ఏకిపారేసిన జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభ జరిగిన తీరును ఆయన తప్పుబట్టారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారన్నారు.
బాక్సైట్ తవ్వకాల పైన చంద్రబాబును ఓ ప్రశ్న సూటిగా అడుగుతున్నానని, జీవో 97 ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాల పైన గతంలో చంద్రబాబు గవర్నర్కు కూడా లేఖ రాశారన్నారు. బాక్సైట్ తవ్వకాలను ఆయన ప్రతిపక్ష నేతగా వ్యతిరేకించారని చెప్పారు.
అదే చంద్రబాబు ఇప్పుడు బాక్సైట్ తవ్వకాల విషయంలో జీవో 97మాత్రం రద్దు చేయలేదన్నారు. బాక్సైట్ సరఫరా జీవోను రద్దు చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. చంద్రబాబు ఏకంగా గిరిజన చట్టాలను మార్చేందుకు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారన్నారు.
తమ ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ జరగవద్దని, ఎవరూ ఇక్కడకు రావొద్దని స్థానిక గిరిజనులు స్పష్టంగా చెబుతున్నారన్నారు. అయినా చంద్రబాబు ఎందుకు ముందుకు పోతున్నారని ప్రశ్నించారు. వైయస్ తొలుత బాక్సైట్ తవ్వకాలకు సిద్ధమైనప్పటికీ.. ప్రజలు నిరాకరించడంతో ఆయన వద్దనుకున్నారన్నారు.
ప్రజల మనోభావాలను గౌరవించే వాడే నాయకుడు అన్నారు. కానీ చంద్రబాబు ప్రజల మనోభావాలకు ఎందుకు వ్యతిరేకంగా పోతున్నాడన్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వైయస్ చేసినా, కిరణ్ కుమార్ రెడ్డి చేసినా, చంద్రబాబు చేసినా, చివరకు జగన్ చేసినా తప్పేనన్నారు.
జీవో 97 చట్టం గిరిజనుల భూములన్నింటిని మైనింగ్ చేసుకోమని చెబుతోందని, దానిని మాత్రం రద్దు చేయలేదన్నారు. చంద్రబాబు ఇలా చేయడం మొదటిసారి కాదన్నారు. నాడు ఎస్సీ వర్గీకరణకోసం ఇష్యూ చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ అసాధ్యమని తెలిసినా రాజకీయం చేస్తున్నారన్నారు.
జీవో 97 రద్దు చేయకపోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. బాక్సైట్ తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన సంక్షేమానికే ఉపయోగిస్తామని చంద్రబాబు చెబుతున్నారని, అంటే దాని అర్థం మైనింగ్ ఆపమని చెప్పడమే అన్నారు.
మనిషి అన్నాక కాస్తో కూస్తో సిగ్గు, చీము నెత్తురు ఉండాలన్నారు. అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడం చంద్రబాబుకు సరికాదన్నారు. బాక్సైట్ తవ్వకాలను దొడ్డిదారిన కొందరికి కట్టబెట్టే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారన్నారు.