"చంద్రబాబు మీడియా ముందుకు రారు, చిటపటలని లీకులు"
నెల్లూరు: కేంద్ర బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మౌనంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఐదు రోజులవుతున్నా ఇప్పటి వరకు చంద్రబాబు మీడియా ముందుకు రాలేదని ఆయన అన్నారు.
Recommended Video
తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ బుధవారంనాడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం హసనాపురంలో వైయస్ జగన్ ముస్లింలతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు.
బోర్ కొట్టంచే చంద్రబాబు
రోజూ గంటలు గంటలు మీడియాతో మాట్లాడి ప్రజలకు బోర్ కొట్టించే చంద్రబాబు ఇప్పుడెందుకు మీడియా ముందుకు రావడం లేదని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు మీడియా ముందుకు రాకుండా తన అనుకూల మీడియాతో లీకులు ఇప్పిస్తున్నారని, బడ్జెట్పై చంద్రబాబు చిటపటలాడుతున్నారని ఆ మీడియా ఊదరగొడుతోందని ఆయన అన్నారు.
చంద్రబాబుకు తెలియకుండా జరిగిందా...
చంద్రబాబుకు తెలియకుండానే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందా అని జగన్ అడిగారు. నిజానికి ఇది ప్రస్తుత ప్రభుత్వం ఐదో కేంద్ర బడ్జెట్ అని, చంద్రబాబు పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఆమోదించిన తర్వాతనే బడ్జెట్ను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.
వైఫల్యాలను కేంద్రం మీదికి నెట్టేందుకే...
తన తప్పులను, వైఫల్యాలను కేంద్రం మీదికి నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు విశ్వసనీయత లేని, విలువలు లేని రాజకీయం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
నరేంద్ర మోడీ హవా డౌన్ కాగానే...
కేంద్రంలో మోడీ హవా ఎక్కువగా ఉన్నప్పుడు చంద్రబాబు మైనారిటీలను విస్మరిస్తున్నరని, మోడీ హవా డౌన్ కాగానే చంద్రబాబుకు మైనారిటీలు గుర్తుకు వస్తున్నారని జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా సంజీవిని అని, పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు హోదా ఏమైనా సంజీవినా ్ని రివర్స్ ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు.