మీ బావమరిది బాలయ్య ఏం చెప్పారో గుర్తుందా..?
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని జగన్ ఆరోపించారు. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

అనని మాటలను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారికి ఆపాదిస్తూ, వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయన్ను అరెస్టు చేయడమే కాకుండా సాక్షి యూనిట్ ఆఫీసులమీద ఒక పథకం ప్రకారం దాడులు చేయించారని జగన్ ధ్వజమెత్తారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని చంద్రబాబు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ అన్న మాటలు చూస్తే.. మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుందని వైఎస్ జగన్ విమర్శించారు.
రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని జగన్ ఆరోపించారు. ఈ ఏడాది పాలనలో మహిళలు, బాలికల పట్ల ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదనే విషయం తేలిపోయిందని అన్నారు.
అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుకునే తమ కూతురు తన్మయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనిపెట్టడానికి చంద్రబాబుకు, చంద్రబాబు యంత్రాంగానికి చేతకాలేదని విమర్శించారు.
శ్రీ సత్యసాయి జిల్లా, రామగిరి మండలం, ఏడుకుర్రాకులపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై 6 నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 14 మంది అత్యాచారం చేస్తే, బాధితురాలు ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టారు, నేరం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం మీకు (చంద్రబాబు) చేతకాలేదు.. అని జగన్ పేర్కొన్నారు.
కొందరు చేస్తున్న అఘాయిత్యాలకు స్కూలుకు వెళ్తున్న బాలికలు గర్భం దాలుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు, బాలికలు అత్యాచారాలకు గురైతే, 15 మందిని రేప్ చేసి చంపేశారు. వందలకొద్దీ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేదింపులకు పాల్పడ్డారు. మీ ట్రాక్ రికార్డు ఇంత ఘోరంగా ఉంది.. అని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు గారూ.. మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. అధికారంకోసం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, తీరా సీట్లోకి వచ్చాక వారికి నిలువెల్లా వెన్నుపోటు పొడిచి, ఏడాది పాలన తర్వాత ప్రజలముందు దోషిగా నిలబడ్డారు.. అని జగన్ ఎదురుదాడికి దిగారు.
చతికిలపడ్డ, అసమర్థ, అవినీతి, అరాచక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేయించి, కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం చెల్లవు చంద్రబాబు గారూ.. అంటూ నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications