అందుకే లేటుగా వచ్చా-డ్రామాలు పక్కనబెట్టాల్సిందే-కోనసీమ వరద బాధితులతో జగన్
ఏపీలో గోదావరి వరద కారణంగా కోనసీమ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద ఇళ్లలోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గోదావరికి ఇటు, అటు ఉన్న జిల్లాల్లో పరిస్ధితులు దారుణంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటించారు. కానీ సీఎం జగన్ మాత్రం కాస్త ఆలస్యంగా ఇవాళ పర్యటిస్తున్నారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో తన పర్యటన ఆలస్యం కావడంపై సీఎం జగన్ ఇవాళ బాధితులకు కారణం వెల్లడించారు. వరద బాధితులందరికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో వరద బాధితుల్ని పరామర్శించిన సీఎం జగన్.. వారితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా.. అరిగెలవారి పేటలో బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ''ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలన్నారు. వరదల్లో తాను వచ్చి ఉంటే అధికారులు తన చుట్టూ తిరిగేవాళ్లని, అందుకే అధికారులకు వారం టైం ఇచ్చి తాను ఇక్కడికి వచ్చానని జగన్ తెలిపారు. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని ఆయన బాధితులకు భరోసా కల్పించారు.
వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జి.పెదపూడి లంక వద్ద వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ తన పర్యటనలో బాధితులకు హామీ ఇచ్చారు. సీజన్ ముగియక ముందే వరద నష్టం అందిస్తామని కూడా సీఎం జగన్ తెలిపారు. జగన్ తన పర్యటనలో భాగంగా స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్తూ వారికి అందుతున్న సాయంపై ఆరా తీస్తున్నారు. కలెక్టర్లు, ఇతర అధికారులు,వాలంటీర్ల పనితీరుపైనా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇప్పటికే వరద సహాయక చర్యలకు సాయం విడుదల చేసిన ప్రభుత్వం బాధితులకు ఒక్కొక్కరికి రూ.2 వేలు సాయం అందిస్తోంది. ఇది సక్రమంగా అందుతుందా లేదా అన్న దానిపై జగన్ ఆరా తీస్తున్నారు.