రాజధానులపై జగన్ కీలక సమీక్ష-వైజాగ్ మెట్రోరైల్, క్లీన్ ఏపీ- ఎంఐజీ లేఅవుట్లకు ఆదేశాలు
ఏపీలో వైసీపీ సర్కార్ మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఆ లోపే ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదని విపక్షాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజధానులతో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుతున్న మున్సిపల్ పనుల పురోగతిపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
ప్రతీ నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లు
రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఇవాళ మున్సిపల్ సమీక్షలో అధికారుల్ని ఆదే్శించారు. ఈ లే అవుట్స్ ఆదర్శనీయంగా ఉండాలన్నారు. అవుట్స్ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. రతి ఒక్కరూడా వీటిని చూసి, ఇదే మాదిరిగా లే అవుట్స్ ఉండాలన్న రీతిలో వీటిని తీర్చిదిద్దాలన్నారు. న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలని కోరారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాలు గుర్తించారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైయస్సార్, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో రెండు చోట్ల లే అవుట్స్ పనులు, 864.29 ఎకరాల్లో లే అవుట్ పనులు పూర్తి చేసి మే చివరినాటికి సిద్ధం చేస్తున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు.
2.
క్లీన్ ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏంటి? అన్నదానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులకు జగన్ సూచించారు. ఏ కలర్ డబ్బాలో ఏ చెత్త వేయాలి అన్నదానిపై కరపత్రాలను ప్రతి ఇంటికీ ఇవ్వాలన్నారు. ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామని అధికారులు సీఎంకు తెలిపారు. 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికి పంపిణీ చేస్తామన్నారు. 2426 ఆటోలు ఇప్పటికే క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయని తెలిపారు. మిగిలినవి ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. 1123 ఇ-ఆటోలు కూడా జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
తాగునీరు, టిడ్కో ఇళ్లు, రోడ్లు
ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ప్రతిరోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలన్నారు. దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలన్నారు. ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలన్నారు. దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. టిడ్కో ఇళ్ల కోసం పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటికోసం వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఇవి లేకపోతే మళ్లీ మురికివాడలు మాదిరిగా తయారయ్యేవని సీఎం అన్నారు. మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా అడుగులు ముందుకేస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్లను ఆ మేరకు తీర్చిదిద్దామన్నారు. టిడ్కో ఇళ్ల మీద సుమారుగా రూ.5500 కోట్లు ఈ మూడేళ్లలో ఖర్చుచేసినట్లు తెలిపారు.
అలాగే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్లపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ సూచించారు. ఎక్కడైనా గుంతలులేని రోడ్లు కనిపించాలన్నారు. నాడు - నేడు కింద బాగు చేసిన రోడ్లను చూపించాలన్నారు. జూన్నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామని అధికారులు జగన్ కు తెలిపారు.
అమరావతి, వైజాగ్ రాజధానులపై ఆదేశాలు
అమరావతి ప్రాంతంలో పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించామని, దీంతో పనులు వేగవంతం అవుతున్నాయన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ-3)పైన కూడా దృష్టిపెట్టామని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.
అలాగే విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. వనరుల సమీకరణపై చర్చించారు. సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రతిపాదనలు ఇచ్చారు. మెట్రోరైల్ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలని సీఎం ఆదేశించారు. పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు.