ఆధారాలతో రండి: జగన్, రాద్దాంతం చేస్తాం, బాబును వదిలిపెట్ట: కాల్ మనీపై రోజా
హైదరాబాద్: కాల్ మనీ, సెక్స్ రాకెట్, బాక్సైట్ తవ్వకాలు, కల్తీ మద్యం, భూసేకరణ, ఇసుక మాఫియా వంటి వాటితో పాటు ప్రభుత్వ వైఫల్యాల పైన అందరు కూడా పూర్తి ఆధారాలతో అసెంబ్లీకి రావాలని, సభలో టిడిపిని నిలదీద్దామని వైసిపి అధ్యక్షులు అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.
బుధవారం హైదరాబాదులోని లోటస్ పాండులో వైసిపి శాసన సభా పక్షం భేటీ అయింది. జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం జ్యోతుల విలేకరులతో మాట్లాడారు. కాల్ మనీ కేసుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు.
రంగుమారిన ధాన్యం కొనుగోలు, కరువు, మద్యపాన నిషేధం, బాక్సైట్ తవ్వకాలు, విపరీతంగా పెరుగుతున్న ధరల పైన అసెంబ్లీలో చర్చించాలని కోరుకుంటున్నామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. జగన్ నిరంతర పోరాట యోధుడన్నారు.
కాల్ మనీ కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేయవద్దన్నారు. మేం ప్రజల కోసమే రాద్దాంతం చేస్తామని, సిద్ధాంతాల కోసం పోరాడుతామన్నారు. నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
వీఆర్ఏ, అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు ప్రస్తావిస్తామన్నారు. విచ్చలవిడి కల్తీ మద్యం అమ్మకాలు, అమాయకులు చనిపోయిన ఘటనపై చర్చిస్తామన్నారు. ఏపీలో మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు.
చంద్రబాబుపై రోజా నిప్పులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతులు చెబుతారని కానీ పాటించరని వైసిపి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్ మనీ వ్యవహారం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలను ఆరు రోజులకే పరిమితం చేయడం సరికాదన్నారు. కనీసం నెల రోజులు ఉండాలన్నారు.