శిలువ గుర్తుతోజగన్ పుష్కర స్నానం: ఆరెస్సెస్, బిజెపికు ప్రచార సాధనం!
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు రాజమండ్రిలో పుష్కర స్నానం ఆచరించారు. అయితే, ఆయన తన మెడలో క్రాస్ గుర్తుతో (శిలువ గుర్తు) పవిత్ర స్నానం చేయడంపై సామాజిక అనుసంధాన వేదికల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెడలో క్రాస్ గుర్తుతో జగన్ పవిత్ర స్నానం ఆచరించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై కామెంట్లు వస్తున్నాయి.
కొందరు ముఖ్యులు కూడా దీనిపై కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. క్రాస్ గుర్తుతో స్నానం చేయడంపై రెండు రకాలుగా విమర్శలు వస్తున్నాయి. పుష్కర స్నానం హిందువులు పవిత్రంగా చేసేది.
దానితో పాటు, జగన్ క్రాస్ గుర్తుతో స్నానం చేయడం వల్ల.. క్రైస్తవులు హిందూ దేవుళ్లను నమ్ముతున్నట్లుగా కనిపిస్తుందని, ఇది ఆరెస్సెస్, బిజెపిలకు ప్రచార సాధనంగా ఉపయోగపడవచ్చుననే కామెంట్లు కూడా వస్తున్నాయి.
జగన్ కుటుంబం ఒకప్పుడు హిందువులు అని, ఆ కారణంగానే అతను పవిత్ర స్నానం చేశారని, కొందరు చెబుతుంటే, వైయస్ విజయమ్మ చేతిలో బైబిల్ ఉండటాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. మరికొందరు, ఇది జగన్కు సంబంధించిన అంశమని అంటున్నారు. అయితే, జగన్ రాజకీయ కోణంలోనే పవిత్ర స్నానం చేశారనే వారు లేకపోలేదు.