సీఎం జగన్ ఎన్నిక చెల్లదంటూ ఉత్తర్వులు - విచారణకు ఈసీ ఆదేశం: మీడియా కథనంగా..!!
అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక చెల్లదని తేల్చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే గుంటూరు జిల్లాలో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో వైఎస్ జగన్ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పటివరకు గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించిన ఆయన తల్లి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.
వైఎస్ఆర్సీపీకి వ్యవస్ధాపకుడి, పార్టీ అధినేతగా ఉంటూ వచ్చారు వైఎస్ జగన్. ప్లీనరీ సందర్భంగా ఆయనను శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇకపై అధ్యక్ష ఎన్నికలు నిర్వహించకుండా ఈ ఏర్పాటు చేసుకుంది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ కొనసాగుతారంటూ ప్లీనరీలో తీర్మానించారు. అనంతరం దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పంపించారు.

ఇప్పుడా తీర్మానం చెల్లదంటూ తాజాగా ఎన్నికల కమిషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని తేల్చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీకయినా ఎన్నికలు నిర్వహించి తీరాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకయినా శాశ్వత పదవులను ఏర్పాటు చేసుకోవడం కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల, నిబంధనలకు విరుద్ధమని వివరించారు.
ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను వారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శికి పంపించారు. శాశ్వత అధ్యక్షుడిని నియమించుకోవడం అనేది నిబంధనలకు విరుద్ధమంటూ తాము ఇదివరకే తెలియజేశామని పేర్కొన్నారు. ఈ అంశంపై పలు లేఖలను రాశామనీ చెప్పారు.
మీడియాలో ఈ కథనాలు వెలువడిన కొద్దిసేపటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అవన్నీ మీడియా కథనాలుగా తేల్చింది. తాము అలాంటి ఆదేశాలనేదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జయదేబ్ లాహిరి ఓ ప్రకటన విడుదల చేశారు. వీలైనంత త్వరగా విచారణను ముగిస్తామని పేర్కొన్నారు. మీడియా కథనాలను తోసిపుచ్చాలని వైఎస్ఆర్సీపీకి సూచించారు.












Click it and Unblock the Notifications