రెచ్చగొడుతున్నారు: బోండా, ఎన్ని కష్టాలైన పడతా: జగన్, 'మోడీని-జగన్ను కలిసి చూడలేం'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఉనికిని కోల్పోతోందని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి తప్పించుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఒక్క సలహా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.
ప్రాజెక్టులను అడ్డుకునేందుకే కోర్టులలో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో జగన్ పక్క రాష్ట్రాల వారిని రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. స్వార్థం కోసం రైతులు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. జగన్ మాటలను, ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదన్నారు.

ఎన్ని కష్టాలు వచ్చినా అమలు చేస్తా
జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన పాదయాత్ర మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఎన్నికష్టాలు వచ్చినా అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

నాలుగు విడతల్లో అమలు
నవరత్నాల అమలు కోసం ఎన్ని కష్టాలైనా పడతామని జగన్ అన్నారు. పేదలందరికీ రూ.2 వేల పింఛన్లు పంపిణీ చేస్తామని, మహిళలకు రుణమాఫీని నాలుగు విడతల్లో అమలు చేస్తామని చెప్పారు. మంగళవారం పునబాక చెరువుతట్టు కండ్రిగ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర చెంబేడు, సీఎన్ పేట వరకు సాగింది.

జగన్ మద్దతు బీజేపీ స్వీకరించదు
ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు తెలుపుతానని రెండో రోజుల క్రితం జగన్ అన్నారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ మద్దతును బీజేపీ స్వీకరించదని చెప్పారు. మోడీని, జగన్ను పక్క పక్కన చూడలేమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఎవరినీ బలవంతంగా పిలవడం లేదు
నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచే ప్రధాని పక్కన జగన్ను చూడలేమని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. బీజేపీకి ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని మంత్రి మాణిక్యాల రావు అన్నారు. బీజేపీకి జగన్ స్వచ్చంధంగా మద్దతిస్తే అభ్యంతరం లేదని మాణిక్యాల రావు అన్నారు. ఎవరినీ బలవంతంగా పిలవడం లేదన్నారు.

వైసీపీతో పొత్తు ఇష్టం లేదు కానీ
అవినీతి, అరాచకాలకు నిలయమైన వైసీపీతో పొత్తును తాను వ్యక్తిగతంగా ఇష్టపడటం లేదని, ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందని, పొత్తుల అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, కానీ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కామినేని అన్నారు.












Click it and Unblock the Notifications