జగన్కు కడపలో బీజేపీ షాక్, వెంకయ్యతో ఎమ్మెల్యే
కడప: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాకు చెందిన కందుల సోదరులు షాకిచ్చారు. వారు ఆదివారం నాడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు.
కందుల సోదరులు జిల్లాలో పేరున్న నాయకులను, వారు తమ ఆస్తులను పోగొట్టుకోవడమే కానీ, ప్రజల సొమ్మును తాగే స్వభావం లేని వారన్నారు. పార్టీని ఎంపిక చేసుకోవడం అంటే జీవిత భాగస్వామని ఎంపిక చేసుకోవడం వంటిదే అన్నారు. సమర్థులైన కందుల సోదరుల చేరికతో కడప జిల్లాలో బీజేపీ మరింత బలపడుతుందన్నారు.

జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉన్న యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తోందని, వారికి వెన్నంటి ఉండి సహకరిస్తే యువ నాయకులుగా ఎదుగుతారన్నారు. తాను ఎవరినీ పార్టీలోకి రమ్మనలేదని, అలాగే రావాలనుకునే వారిని కాదనమన్నారు.
వెంకయ్య సమక్షంలో కందుల సోదరులు.. కందుల శివానంద రెడ్డి, రాజమోహన్ రెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, మాజీ మంత్రి సరస్వతమ్మలు కమల తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు, కడపలో బీజేపీ బలోపేతం దిశగా పయనిస్తోంది. కేంద్రమంత్రి వెంకయ్యను వైసీపీకి చెందిన బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, కడప మేయర్ సురేష్ బాబులు కలిశారు.

అంతకుముందు సురేష్ బాబు కడప విమానాశ్రయంలో వెంకయ్యకు స్వాగతం పలకగా, జయరాములు అతిథి గృహంలో కేంద్రమంత్రిని కలిశారు. కాగా, వెంకయ్య పర్యటనలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు మంతనాలు చేస్తారనే ప్రచారం జరిగింది. వీరు ఆయనను కలవడం చర్చకు దారి తీసింది.
అయితే తాము సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లామని వారు చెప్పారు. రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే గంటి ప్రసాద్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన దూరంగా ఉన్నారు. అయితే, పలువురు జిల్లా నేతలు బీజేపీతో చర్చలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications