బాబాయ్కి జగన్ బంపర్ ఆఫర్- తీవ్ర పోటీ ఉన్నా రెండేళ్ల ఛాన్స్ - నేడు ప్రకటన
టీటీడీ ఛైర్మన్, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి మరో అరుదైన అవకాశం లభించబోతోంది. ప్రస్తుతం టీటీడీ బోర్డు రెండేళ్ల పదవీకాలం సోమవారంతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీ నేతల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బాబాయ్ దక్కించుకోబోతున్న ఆ ఆఫర్పై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదీ తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో కీలక నేతల్ని కాదని బాబాయ్కు జగన్ ఈ అవకాశం కల్పించబోతున్నారు. దీనిపై ఇవాళ ప్రకటన వెలువడనుంది.
ముగియనున్న టీటీడీ బోర్డు గడువు
ఏపీలో తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు రెండేళ్ల గడువు సోమవారంతో ముగియబోతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన బోర్డులో పలు కీలక మార్పులతో ఏర్పాటు చేశారు. దీనికి ఛైర్మన్గా పార్టీలో కీలక నేత, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. ఇప్పుడు బోర్డు పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త బోర్డు ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఇవాళ బోర్డు చివరి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో బోర్డు ఛైర్మన్ భవిష్యత్తు కూడా తేలబోతోంది.
టీటీడీ కొత్త పాలక మండలి
టీటీడీ పాలకమండలి గడువు సోమవారంతో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త బోర్డు ఎంపిక మరోసారి ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన బోర్డులో అవకాశం దక్కించుకున్న వారిలో పలువురిపై విమర్శలు వచ్చాయి. అయినా వారంతా ఏదోలా రెండేళ్లు నెట్టుకొచ్చారు. ఇప్పుడు మరోసారి బోర్డు నియామకం కోసం ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరెవరుండాలి, ఛైర్మన్ పదవిలో ఎవరుండాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మరోసారి టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ బోర్డు గడువు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త పాలకమండలి ఎంపికతో పాటు ఛైర్మన్ ఎంపిక కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం కసరత్తు చేసిన ప్రభుత్వం.. మరోసారి టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డినే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళ బోర్డు పాలకమండలి చివరి సమావేశం సందర్భంగా సుబ్బారెడ్డి కొనసాగింపుపై నిర్ణయం వెలువడే అవకాశముంది. రెండేళ్లుగా వైవీ సుబ్బారెడ్డి సేవల్ని గుర్తిస్తూ పొడిగింపు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. రేపు స్వామివారి ఆలయంలో భోగశ్రీనివాస మూర్తికి ఏకాంతంగా సహస్రకలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 22 నుంచి శ్రీవారికి జేష్టాభిషేకం ఉత్సవాలు జరగాల్సి ఉంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల నాటికి కొత్త బోర్డు కొలువుదీరాల్సి ఉంది. ఈ నెల 24వ తేదీన వర్చువల్ ఆర్జిత సేవల్ని కూడా టీటీడీ రద్దు చేసింది.
తీవ్ర పోటీలోనూ బాబాయ్కే ఛాన్స్
టీటీడీ పాలకమండలి గడువు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ఛైర్మన్ పదవి కోసం వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డితో పాటు నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ కీలక పదవి కోసం పోటీపడ్డారు. అయితే వారిలో ఎవరికి ఇచ్చినా మిగతా వారు అలగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వీరెవరికీ ఇవ్వకుండా బాబాయ్కే పొడిగింపు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో బాబాయ్ వరుసగా రెండోసారి టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు దక్కించుకోనున్నారు.
మరోవైపు వైవీ సుబ్బారెడ్డిని కేబినెట్తో తీసుకుంటారని, రాజ్యసభకు పంపుతారని పలు ఊహాగానాలు వచ్చినా జగన్ మాత్రం కీలకమైన టీటీడీ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు.
బోర్డు మెంబర్లకూ పొడిగింపు ?
టీటీడీ ఛైర్మన్గా బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి రెండేళ్ల పదవీకాలం పొడిగింపు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం జగన్.. బోర్డులోని ఇతర మెంబర్లకు సైతం ఒకటి లేదా రెండేళ్ల పదవీకాలం పొడిగింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 37 మంది బోర్డు మెంబర్లు పదవిలోకి రాగానే కరోనాతో వారు ఆ పదవులు అనుభవించే అవకాశం లేకుండా పోయింది. రెండేళ్లుగా ఇదే తంతు. దీంతో టీటీడీ సభ్యులు అయ్యామన్న సంతృప్తి వారికి లేకుండా పోయింది. దీంతో వీరికి కూడా పొడిగింపు ఇస్తే బావుంటుందని జగన్ భావిస్తున్నారు. అయితే ఎవరికి ఎంత పొడిగింపు ఇస్తారన్నది ఇంకా తేలలేదు.
Recommended Video