తన్ని తరిమేసిన చరిత్ర, రైతులకు అత్యాశ.. ఇదీ చంద్రబాబు ప్రచారం: జగన్
ఇష్టం లేకుండా భూములు లాక్కోవాలని చూస్తే తన్ని తరిమేసిన చరిత్ర కోన గ్రామానికి ఉందని, ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు.
కోన: ఇష్టం లేకుండా భూములు లాక్కోవాలని చూస్తే తన్ని తరిమేసిన చరిత్ర కోన గ్రామానికి ఉందని, ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంత అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు.
పోర్టు పేరుతో బలవంతంగా చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే కోన గ్రామం ఊరుకోదన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడని, కానీ చంద్రబాబు మాత్రం ప్రజల ఆస్తులను లాక్కొని, దళారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఇలాంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి మరే రాష్ట్రానికి ఉండరని చెప్పారు. సాయంత్రం బందర్ పోర్టు బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు పోర్టుకు నాలుగు వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారని గుర్తు చేశారు.

నాడు కేవలం 1800 ఎకరాలు చాలు అన్న చంద్రబాబు, ఇప్పుడు మాత్రం ప్రజలతో ఆడుకుంటున్నారన్నారు. నాలుగు వేల ఎకరాలు కూడా సరిపోదని, 30వేల ఎకరాలు కావాలని చెప్పి, మరోసారి మాట మార్చి లక్షా అయిదువేల ఎకరాలు అడుగుతున్నాడన్నారు.
అమ్ముకోకుండా కుట్రలు
వీలయినంత తక్కువ భూమిలో పోర్టు కట్టించాలని, మిగతా భూములను రైతులకే వదిలి పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. పోర్టు పేరుతో అధికంగా భూములు తీసుకొని వేరే వాళ్లకు అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ల్యాండ్ పూలింగ్ ఒక దారుణమైన చర్య అన్నారు. సొంత భూమిని లాక్కొని వారికి వెయ్యి గజాలు మాత్రం ముష్టివేస్తారని ధ్వజమెత్తారు దీనిని ఎలా సమర్థించాలని నిలదీశారు. రైతులకు అతి ఆశ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎకరాకు రూ.30వేలు పదేళ్ల పాటు ఇస్తానని చంద్రబాబు అన్నారని, చివరకు అవి కూడా ఇవ్వడం లేదన్నారు. ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల ధర ఉంటే వేలు ఇచ్చి బలవంతంగా భూములు లాక్కుంటారా అని నిలదీశారు.
లోన్లు ఇవ్వకుండా కక్ష
చంద్రబాబుకు అసైన్డ్ భూములు అంటే చులకన అన్నారు. పేదవారికి మరిన్ని అసైన్డు భూములు ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి, ఇష్టారీతిన లాక్కోవడం సరికాదన్నారు. ఇక్కడ భూములకు కాలువ నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బ్యాంకుల నుంచి క్రాప్ లోన్లు కూడా ఇవ్వకుండా కట్టడి చేస్తూ రైతుల పైన కక్ష పూరిత చర్యలు చేస్తున్నారని, తద్వారా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు పాలన మరెంతో కాలం సాగదన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం భూములు కూడా అమ్ముకోకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. దేవుడు దీవిస్తే మరో ఏడాదిలో ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుందని, అప్పుడు ప్రజల భూములు భద్రంగా ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications