పాలమూరు ప్రాజెక్టు: అనుమతి లేదన్న జగన్, కేసీఆర్ ఏమంటారు?
హైదరాబాద్: పాలమూరు జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు.
ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తాగు నీటికి ఇబ్బంది అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీ విభజన చట్ట ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మించడానికి గాను కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైయస్ జగన్ గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.
పాలమూరు ప్రాజెక్టుకు కృష్ణా నీటిలో ఎలాంటి కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు నిర్మించడానికి శంకుస్ధాపని చేసిందని, ఈ ప్రాజెక్టు వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రస్తుత ఆయకట్టుకు కూడా ఇబ్బందులు వస్తాయన్నారు.
ఇటీవలే పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్, అమిస్తాపూర్ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలేదురైనా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెకుకు కురుమూర్తి ప్రాజెక్టుగా పేరుును మారుస్తూ ప్రజల సమక్షంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్టు ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుని మూడు సంవత్సరాలలోపే 70 శాతం పనులు పూర్తిచేసి నీరందించి తీరుతానన్నారు. తెలంగాణ తెచ్చుకున్న ఫలితం పాలమూరు ప్రజలకు దక్కాలన్నారు.
కృష్ణా జలాలను తీసుకొచ్చి పాలమూరు ప్రజల కష్టాలను తీరుస్తామని చెప్పారు. ఇప్పుడు తాజాగా వైయస్ జగన్ పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.