బంద్ సక్సెస్, అవసరమైతే చంద్రబాబు కాలర్ పట్టుకుంటాం: జగన్
హైదరాబాద్: ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తాము నిర్వహించిన బంద్ శనివారం విజయవంతమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. బంద్ను విజయవంతం చేసిన అన్నివర్గాల ప్రజలకు కృతజ్ఞతల చెప్పారు. ఈ పోరాటం ఆగదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని, ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా పాత పాటే పాడుతున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో మాట్లాడలేక మండలిలో రెండు గంటల పాటు మాట్లాడి ప్రత్యేక హోదాను స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదమిటని, ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయని చంద్రబాబు సిగ్గు లేకుండా అన్నారని ఆయన అన్నారు.
అసెంబ్లీలో బల్లలెక్కిన ఎమ్మెల్యేల వీడియోలు విడుదల చేశారని వింటున్నామని, ప్రత్యేక హోదా కోసం తాము బల్లలెక్కుతామని అన్నారు. చంద్రబాబు శుక్రవారం నుంచి బంద్ను విఫలం చేయడానికి అరెస్టులు చేసినా, బలవంతంగా బస్సులు నడిపించాలని చూసినా, అమానవీయంగా వ్యవహరించినా ఐదు కోట్ల మంది ప్రజలు బంద్ను విజయవంతం చేశారని జగన్ చెప్పారు.
ప్రత్యేక హోదాను ఇవ్వబోమని చెబుతూ కేంద్రం తరఫున మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ఇస్తూ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని చంద్రబాబు అర్థరాత్రి చెప్పినందుకు నిరసనగా బంద్ విజయవంతమైందని ఆయన అన్నారు. హోదా ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందని, తన స్వార్థం కోసం, వీడియోల్లోనూ ఆడియోల్లోనూ దొరికిపోయిన కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు తన స్వార్థం కోసం హోదాను అడగడం లేదని అన్నారు.
ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారని, చంద్రబాబు మనిషేనా అని ఆయన అన్నారు. ఈ మనిషి పాలించడానికి అర్హుడా అని ఆయన అడిగారు. ప్రత్యేక హోదాకు ఈ మనిషే అడ్డు పడుతున్నారని ఆయన అన్నారు.