వైయస్సార్సీపీ జాతీయ పార్టీ, కెసిఆర్ సాధించారు: జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జాతీయ పార్టీగా మారిందని ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. హైదరాబాదులోని లోటస్ పాండులో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాన్ని భౌతికంగా విడదీసినా తెలుగు ప్రజలను ఎవరు వేరు చేయలేరన్నారు.
రెండు రాష్ట్రాల ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రాంతాన్ని ఏ ముఖ్యమంత్రి అభివృద్ధి చేయనంతగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజల గుండెల్లో వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రత్యేక స్థానముందన్నారు.

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు వైయస్ జగన్ చెప్పారు. అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జగన్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, పార్టీ జెండాను ఆవిష్కరించారు.
కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ శ్రీదేవి చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు, రవాణాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు, తనిఖీలు నిర్వహించనున్నారు. రవాణాశాఖకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య మినహాయింపు ఉన్నందున కొన్నాళ్లపాటు బస్సులకు మినహాయింపు ఉంటుంది. ఆ తరువాత అన్ని వాహనాలకు పర్మిట్లు, పన్ను రసీదులు చూపించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications