Tirumala Laddu: జగన్ కు ఇండియా కూటమి షాక్? తిరిగి ఎన్డీఏ సాయానికి ప్రయత్నాలు..!
ఏపీలో రాజకీయాలు ఎప్పుడే మలుపు తిరుగుతాయో తెలియదు. బండ్లు ఓడలవుతుంటాయి, ఓడలు బండ్లు అవుతుంటాయి. దీనికి ఏ పార్టీ, ఏ రాజకీయ నేతా మినహాయింపు కాదు. గతంలో ఎన్డీయేతో స్నేహం చేసి ఆ తర్వాత బద్ధశత్రువుగా మారి నష్టపోయిన చంద్రబాబు.. తిరిగి ఐదేళ్లలోపే తిరిగి అదే ఎన్డీఏ సాయంతో అధికారం చేపట్టారు. అలాగే గతంలో ఎన్డీయేకు అడక్కపోయినా సాయం చేసి ఆప్తమిత్రుడిగా కొనసాగిన జగన్ ఐదేళ్లలోనే వారికి రాజకీయ శత్రువుగా మారిపోయారు. ఏపీలో తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన జగన్ ఇప్పుడు మళ్లీ ఎన్డీయే బాట పట్టారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు కలిపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కనీసం మాట సాయం చేసేందుకు కూడా జాతీయ పార్టీలు ముందుకు రావడం లేదు. పైపెచ్చు గతంలో ఇండియా కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించి కాంగ్రెస్ మినహా మిగతా పార్టీల మద్దతు పొందిన జగన్ కు ఇప్పుడు రాహుల్ గాంధీ మరోసారి షాకిచ్చారు. తిరుమల లడ్డూ వివాదంలో దోషుల్ని శిక్షించాలంటూ రాహుల్ చేసిన ట్వీట్ వైసీపీకి షాకిచ్చింది. దీంతో రాష్ట్రంలో పీసీసీ ఛీఫ్ షర్మిల సైతం జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

దీంతో జగన్ ముప్పేటదాడిని ఎదుర్కొనేందుకు తిరిగి ఎన్డీయే వైపు చూస్తున్నారు. కేంద్ర, రాష్టాల్లో ఎన్డీఏ అధికారంలో ఉన్న నేపథ్యంలో జగన్ కు మద్దతు లభించడం లేదు. అంతే కాదు రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ చేసిన ఆరోపణల్ని బీజేపీ కేంద్ర మంత్రులు సైతం అందుకుని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి ప్రధాని మోడీవైపు జగన్ చూస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా లడ్డూ విమర్శలన్నీ అబద్దమని వివరణ ఇస్తూ మోడీకి జగన్ లేఖ రాశారు. అయితే మోడీ మాత్రం దీనిపై స్పందించే పరిస్ధితులు కనిపించడం లేదు. ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న మోడీ ఈ వివాదంపై మాట్లాడేందుకు సిద్ధపడటం లేదు. అదొక్కటే జగన్ కు ఊరటగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications