పల్స్ పట్టుకున్న జగన్- అదును చూసి!!
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పోరాటాలకు దిగారు.
ఉమ్మడి గుంటూరు తర్వాత.. తాజాగా చిత్తూరు జిల్లా పర్యటనకు పూనుకున్నారు. చంద్రబాబు సొంత జిల్లా ఇది. ఈ నెల 9వ తేదీన బంగారుపాళ్యం వెళ్లనున్నారు జగన్. మామిడి రైతులను పరామర్శించనున్నారు. వారికి అండగా నిలవనున్నారు. సంఘీభావాన్ని తెలియజేయనున్నారు.

ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గిట్టుబాటు రేటు లేక అల్లాడుతున్న మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ఈ నెల 9న బంగారుపాళ్యెం మామిడి మార్కెట్ను జగన్ సందర్శిస్తారని తెలిపారు.
ఈ మధ్యాహ్నం తిరుపతి క్యాంప్ కార్యాలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో లక్షల హెక్టార్లల్లో సాగు చేసిన మామిడి పంటను కొనేవారు లేకపోవడంతో రైతులు వాటిని రోడ్లపైనే పారబోస్తున్నారని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే మామిడి రైతులు నష్టాలతో కుదేలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని అన్నారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకుని, ప్రభుత్వ మెడలు వంచి గిట్టుబాటు రేటు కల్పించడానికి జగన్ జిల్లాలో పర్యటించనున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, పొగాకు, మిర్చి, పత్తి, మామిడి, చెరకు.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా మామిడిపంటకు ప్రసిద్ది చెందినదని, ఇక్కడ అనేక పల్ప్ పరిశ్రమలు ఉన్నాయని, ఇక్కడి నుంచి పలు రాష్ట్రాలు, దేశాలకు కూడా ఎగుమతులు జరుగుతుంటాయని వివరించారు.
ఈ ఏడాది మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, జిల్లాలోని ప్రధాన మామిడి మార్కెట్ల వద్ద ఎక్కడ చూసినా మామిడి పంటతో కూడిన లారీలు, ట్రాక్టర్లే బారులు తీరి కనిపిస్తున్నాయని చెప్పారు. మార్కెట్ లో మామిడి కొనేవారు లేక, రైతులు తెచ్చిన పంటను రోడ్ల మీద పారవేసి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఎప్పుడూ రైతులు ఇంత దారుణంగా నష్టపోలేదని, మామిడికి రేటు పడిపోయినప్పుడు కోల్డ్ స్టోరేజీలను నిర్మించి, పల్ఫ్ను స్టోరేజీ చేయడానికి కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ముందుకు రావట్లేదని చెప్పారు. పైగా పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ తమ పార్టీ ఆధ్వర్యంలో ఉందని పథకం ప్రకారం ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
ఈ జిల్లాలో 98 శాతం పల్ప్ ఫ్యాక్టరీలు తెలుగుదేశంకు చెందిన వాళ్లవేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. వారికి చెందిన పల్ప్ ఫ్యాక్టరీలతో కొనుగోళ్లు చేయించలేక, ప్రతిదానికీ వైఎస్ఆర్సీపీపై నెపాన్ని నెట్టేయడం, విష ప్రచారం చేయించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు.
సమస్యను పరిష్కరించలేక, దానిపై ఎదురుదాడి చేయడం చంద్రబాబుకు తెలిసిన విద్యగా అభివర్ణించారు పెద్దిరెడ్డి. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవడానికి వారి పక్షాన పోరాడటానికి జగన్ రానున్నారని, ఈ ప్రాంతంలో మామిడి మార్కెట్ను సందర్శించి, రైతులతో మాట్లాడనున్నారని వివరించారు.












Click it and Unblock the Notifications