జగన్ దీక్ష భగ్నం: ఆస్పత్రిలో ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్న వైద్యులు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక దీక్షను మంగళవారం తెల్లవారు జామున పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఉదయం 4 గంటలకు దీక్షాస్థిలికి చేరుకున్నారు. కాసేపు జగన్తో మాట్లాడిన తర్వాత ఉదయం 4.11 గంటలకు దీక్షను భగ్నం చేశారు.
బలవంతంగా జగన్ను దీక్షాస్థలి నుంచి ఎత్తుకెళ్లి ఆస్పత్రికి చేర్చారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, శాంతియుతంగానే తాను దీక్ష చేస్తున్నానని ఆయన పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు వినలేదు.

పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడ ఉఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి జగన్ను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. జగన్కు బలవంతంగా వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు.
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ఐసియులో ఆయనకు వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. జగన్ను 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని ఆస్పత్రి సూపరింటిండెంట్ చెప్పారు. మరో రోజు దీక్ష చేస్తే జగన్ ప్రాణాలకు ముప్పు ఉంటుందనే ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. వైద్యుల సూచన మేరకే జగన్ను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
జగన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి సూపరింటిండెంట్ చెప్పారు. కీటోన్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. ఫ్లూయిడ్స్, ద్రవాహారం తీసుకుంటే జగన్ ఆరోగ్య పరిస్థితి మెరగవుతుందని అన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వైయస్ జగన్ను తల్లి వైయస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి వైయస్ షర్మిల పరామర్శించారు.












Click it and Unblock the Notifications