పవన్ కళ్యాణ్ దెబ్బ, బాబు దూకుడు: చెక్.. జగన్ రాజీనామా ప్రకటన వెనుక వ్యూహం!
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా ప్రకటన వ్యూహాత్మకమేనని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేందుకే మరోసారి రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.
Recommended Video

జగన్ రాజీనామాలపై ఆచితూచి, వ్యూహాత్మక ప్రకటన చేశారని అంటున్నారు. బడ్జెట్ సమావేశాల వరకు చూసి ఆ తర్వాత ముగింపు రోజున అంటే ఏప్రిల్ 6న రాజీనామా చేస్తామని చెప్పారు. బీజేపీతో తాము లాలూచీ పడటం లేదని చెప్పడంతో పాటు టీడీపీని ఇరకాటంలో పడేసేందుకు ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.

ఢిల్లీలో టీడీపీ ఎంపీల పోరుతో వైసీపీ కార్నర్
బడ్జెట్ సమావేశాల అనంతరం ఇటీవల టీడీపీ ఎంపీలు ఢిల్లీలో చేసిన పోరుతో వైసీపీ కొంత ఇరకాటంలో పడింది. ఢిల్లీ సాక్షిగా జగన్ పార్టీని కార్నర్ చేశారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ వైసీపీ కంటే టీడీపీ పైచేయి సాధించింది. ఇది జగన్ను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. దీంతో రాజీనామా అంశాన్ని అనూహ్యంగా తెరపైకి తెచ్చారని అంటున్నారు.

రాజీనామా తర్వాత ఎన్నికల మూడ్
వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. ఆ సమయానికి ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది. వారు రాజీనామా చేసినా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. రాజీనామా అస్త్రంతో క్యాష్ చేసుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.

బాబుపై ఒత్తిడి
ఎన్డీయేలో చేరేందుకు వైసీపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్యాకేజీ సంతృప్తికరంగా ఉంటే టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉంటుంది. బీజేపీ కూడా ఎన్నికల దృష్ట్యా నిధుల విషయంలో సానుకూలత ప్రదర్శించే అవకాశముంది. దీనిని దృష్టిలో పెట్టుకొని జగన్ అనూహ్యంగా రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. రాజీనామా చేసినా నష్టం లేదు. ఎన్నికల మూడ్ ఉంటుంది. ఆ పరిస్థితి రాకున్నా చంద్రబాబుపై ఒత్తిడి పెంచినట్లుగా అవుతుంది. ఇదే జగన్ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.

బాబుకంటే ముందే జాగ్రత్తపడ్డారు
జగన్ రాజీనామా అస్త్రాన్ని ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ ఆ ప్రకటన చేసినా ఫలితం ఉండదని, అవసరమైతే రాజీనామా చేస్తేనే ఆ ఫలితం ఉంటుందని అంటున్నారు. ఏపీకి న్యాయంపై మార్చి 5వ తేదీ వరకు బీజేపీకి టీడీపీ డెడ్ లైన్ విధించింది. అప్పుడు కేంద్రమంత్రులతో రాజీనామా వంటి అంశాలను తొలుత టీడీపీ తెరపైకి తేవాలని భావించింది. కానీ బాబు కంటే ముందే జాగ్రత్తపడి ఆయనను జగన్ ఇరకాటంలో పడేశారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ను కూడా కార్నర్ చేసేందుకు
జగన్ ఈ ప్రకటన ప్రధానంగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టడంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా చెక్ చెప్పినట్లవుతుందని భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీ మాటల యుద్ధం నేపథ్యంలో పవన్ నిధుల లెక్క తేల్చేందుకు ఓ జేఏసీని ఏర్పాటు పనిలో నిమగ్నమయ్యారు. పవన్ జేఏసీని కూడా ఇది కార్నర్ చేసినట్లుగా ఉందని అంటున్నారు.

అందుకే జగన్ ఇలా.. టీడీపీ నేతల విమర్శలు
కాగా, ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ప్రకటనపై టీడీపీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసుల మాఫీ కోసమే మరోసారి తెరపైకి తెచ్చారని అంటున్నారు. చంద్రబాబును ఒత్తిడిలోకి నెట్టి టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వస్తే అందులో చేరుదామని జగన్ చూస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజీనామా ఆమోదానికి సమయం తీసుకుంటుందని అందుకే జగన్ ఈ వ్యూహానికి తెరలేపారని అంటున్నారు. ఢిల్లీలో పోరులో వెనుకపబడినందునే జగన్ తెరపైకి తెచ్చారని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications