కొణతాల రాజీనామాకు జగన్ ఓకే, విజయసాయి టార్గెట్
హైదరాబాద్/చిత్తూరు/విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యునిగా ఉన్న కొణతాల రామకృష్ణను పార్టీ నుంచి తొలగిస్తూ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సాయంత్రం వెల్లడించారు.
ఇటీవల సంభవించిన హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ వచ్చినప్పుడు పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న గండి బాబ్జీ హాజరు కాలేదు. సహాయక చర్యల్లో కూడా పాల్గొనలేదు. దీంతో బాబ్జీని నియోజకవర్గ ఇంచార్జిగా తొలగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గండి బాబ్జీ, కొణతాల రామకృష్ణకు ముఖ్య అనుచరుడు.
బాబ్జీని ఇంచార్జిగా తొలగించడాన్ని సహించలేని కొణతాల మూడు రోజుల కిందట పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను జగన్కు మెయిల్ ద్వారా పంపించారు. తను పార్టీలో ఉండడం ఇష్టం లేదనుకుంటే, దానికి కూడా రాజీనామా చేస్తానని కొణతాల అదే లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖను అందుకున్న జగన్, కొణతాలతో చర్చించేందుకు మైసూరా రెడ్డిని, సోమయాజులను నియమించారు. వారు ఫోన్ చేసినా కొణతాల అందుబాటులోకి రాలేదు. రెండు రోజులుగా కొణతాల ఎవ్వరితోనూ మాట్లాడ లేదని సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ను మంగళవారం జగన్ తన వద్దకు పిలిపించుకుని ఈ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. కొణతాలను తొలగిస్తే, ఎదురయ్యే పరిస్థితులను ఆయన అమర్తో సమీక్షించారు.
2019 ఎన్నికలు టార్గెట్: విజయ సాయి రెడ్డి
రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి చిత్తూరు జిల్లాలో పిలుపు నిచ్చారు. తిరుపతిలో బుధవారం జరిగిన చిత్తూరు జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే పార్టీకి అనుబంధంగా మహాప్రస్థానం పేరి ట మాసపత్రికను తీసుకొస్తామన్నారు. ఇదే తరహాలో ఈ-పేపర్, ఇంటర్నెట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామని వివరించారు. కార్యకర్తల వ్యక్తిగత అంశాలతో కూడిన సమాచారాన్ని సేకరించి డేటాబ్యాంక్లో నిక్షిప్తం చేస్తామన్నారు.