YS Jagan: ఏలేరు ముంపూ మానవ తప్పిదమే-వరదల్ని అడ్డుకోవడమే రావట్లేదన్న జగన్..!
ఏలేరు వరదలకు కారణమైన భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉందని, అయినా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఆరోపించారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ జగన్ పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వరద ప్రాంతాల్లో పర్యటించిన జగన్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏలేరు వరదలను అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ విమర్శించారు.
ఏలేరు రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో ఉన్నప్పటికీ వరదల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్ ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు మానవత్వం ఉంటే ఓ ప్రత్యేకాధికారిని నియమించి ఏలేరు వరదల్ని అడ్డుకునే వారని తెలిపారు. ఐఎండీ నుంచి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ చంద్రబాబు నిర్లక్ష్యంగా ఉండిపోవడం వల్లే ఏలేరు వరదలు వచ్చాయని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్ పూర్తి నీటి మట్టానికి చేరుకున్నప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించలేదన్నారు.

ఏలేరు రిజర్వాయర్ లో నీటి ఇన్ ఫ్లో ఎలా వచ్చిందో, దాన్ని వదలకుండా ప్రభుత్వం ఎలా వదిలేసిందో జగన్ వివరించారు. అందుకే ఈ వరదలు కూడా మానవ తప్పిదమే అన్నారు. బాధ్యతలేని ప్రభుత్వం ప్రజల ప్రాణాల్ని లెక్కలేకుండా వ్యవహరించిందన్నారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారంలో దిట్ట అని, ఆ అబద్ధాలను సైతం అమ్మగలిగిలిన సామర్ధ్యం ఆయనకే ఉందన్నారు. కాలవల ఆధునీకీరణ చేయడంలోనూ చంద్రబాబు విఫలమయ్యారని జగన్ విమర్శించారు. అప్పట్లో తన తండ్రి వైఎస్సార్ కాలవల ఆధునికీకరణ చేపట్టారని, ఆ తర్వాత ఎవరూ దాన్ని పట్టించుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications