జగన్ సిబిఐ విచారణ వెనుక పెద్ద కుట్ర: ఇన్ సైడ్ ట్రేడింగ్పై బాబుకు జగన్ క్లాస్
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో అధికార టిడిపి, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మధ్య రాజధాని అమరావతి విషయంలో మాటల యుద్ధం సాగుతోంది. అసత్య ఆరోపణలు చేసి సిబిఐ విచారణ అని జగన్ చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. అభివృద్ధి జరగకుండా, ఏపీ అభివృద్ధి చెందకుండా కుట్ర అన్నారు.
చర్చ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జగన్ సభలో అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. రాజధాని అక్కడ రాకూడదని, రాష్ట్రం అభివృద్ధి జరగకూడదనే కుట్రతో జగన్ మాట్లాడుతున్నారన్నారు. మంత్రులపై చేసిన ఆరోపణలకు జగన్ సమాధానం చెబుతారా లేద క్షమాపణ చెబుతారా అని నిలదీశారు.
సభాపతి కోడెల శివప్రసాద రావు మాట్లాడుతూ.. ఈ సభ మీ ఇష్టం వచ్చినట్లుగా నడవాలంటే కుదరదన్నారు. ఎవరు మాట్లాడితే వారి పైన ఆరోపణలు చేస్తున్నారని, అది సరికాదన్నారు. ఆరోపణలు నిరూపించాలన్నారు.
రాజధానిపై జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని టిడిపి సభ్యుడు అన్నారు. రాజధాని విషయంలో సిబిఐ విచారణ జరిగితే, దానిని అడ్డు పెట్టుకొని మరోసారి రాద్దాంతం చేస్తాడన్నారు. ఆ కుట్ర ఆయన వెనుక ఉందన్నారు. అందుకే సిబిఐ విచారణ కోరుతున్నారన్నారు.
మంత్రి మాణిక్యాల రావు దొంగ కథ
మంత్రి మాణిక్యాల రావు మాట్లాడుతూ.. ల్యాండ్ పూలింగ్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ఆయన ఓ దొంగ కథను చెప్పారు. ఓ దొంగ ఒక వ్యక్తి నుంచి ఏదో లాక్కొని వెళ్లాడని, దొంగ వెనుక ఆ వ్యక్తి పరుగెత్తుతున్నాడని, కాసేపటికి దొంగ వెనక్కి తిరిగి పరుగెత్తగా, అతని ముందు పోగొట్టుకున్న వ్యక్తి పరుగెత్తాడని, ఇప్పుడు పోగొట్టుకున్న వ్యక్తి ముందు, దొంగ వెనుక ఉన్నాడని, ఇప్పుడు సభలో పరిస్థితి అలా ఉందని జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు.
విచారణ పేరుతో రైతులకు న్యాయం జరగకుండా కుట్ర: యనమల
మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని జగన్ నిరూపించాలన్నారు. నిరూపిస్తే మంత్రులపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారని, లేదంటే జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. పేపర్ ఉందని ఇష్టారీతిన రాయటం సరికాదన్నారు.
మీ వద్ద ఆధారాలు ఉంటే వెంటనే ప్రవేశ పెట్టాలని, లేదంటే సమయం కోరితే అప్పుడే సభ నడుస్తుందన్నారు. మీరు ఆధారాలు నిరూపిస్తే చంద్రబాబు ఇద్దరు మంత్రులను వెంటనే డిస్మిస్ చేస్తారని చెప్పారు. సిబిఐ విచారణ పేరుతో జగన్ రాజధాని అభివృద్ధిని, ఏపీ ఆభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారన్నారు.
స్పీకర్ కోడెల శివప్రసాద రావు మాట్లాడుతూ... సాక్షి పత్రికలో వార్తలు వచ్చిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రైతుల సమాఖ్య ఏర్పడిందని, తమ భూములు తమకు కావాలని వారు కోరేందుకు సిద్ధమయ్యారని, రైతుల్లో అలాంటి అభద్రతా భావం సరికాదన్నారు.
ఇలాంటి నిరాధార ఆరోపణలు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రజల ప్రయోజనాలకు సరికాదన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఆధారాలు ఉంటే వెంటనే ఇవ్వాలన్నారు.
వైయస్ సిబిఐ విచారణకు ఆదేశించారు: జగన్
జగన్ మాట్లాడుతూ... సిబిఐ విచారణ అంటే ఎవరు వెనక్కి పోతున్నారో, ఎవరు ఉలిక్కి పడుతున్నారో అర్థమవుతోందన్నారు. 2006లో చంద్రబాబు సభలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆరోపణలు చేశారని, అప్పుడు వెంటనే వైయస్ సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేశారన్నారు.
సిబిఐ విచారణ అంటే తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారన్నారు. వైయస్లో నిజాయితీ ఉంది కాబట్టి అప్పుడు సిబిఐ విచారణకు ఆదేశించారన్నారు. సింగపూర్ కంపెనీల పేరుతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఓత్ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘించారన్నారు.
మీటింగ్లు పెట్టి భూములు ఇవ్వొద్దన్నారు: చంద్రబాబు
రాజధానికి భూములు ఇవ్వవద్దని వైసిపి నేతలు సమావేశాలు పెట్టారని, భూములు ఇచ్చిన వారిలో వైసిపికి చెందిన వారు కూడా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. వారు భూములు ఇచ్చినందుకు మీకు కక్ష ఉందన్నారు. విచారణ జరిగితే భూముల ధరలు తగ్గాలి, ప్రభుత్వం, రైతులు నష్టపోవాలని జగన్ కుట్ర అన్నారు.
రాజధాని విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూములు కొంటే ఇన్ సైడింగ్ ట్రేడింగ్ అవుతుందని, అలా కొననప్పుడు ఇన్ సైడ్ ట్రేడింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటే ఏమిటో కూడా తెలియదని జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
రైతులు బాధపడుతున్నారు...
భూముల విషయంలో ఆరోపణలు చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని రైతులు అడుగుతున్నారన్నారు. రాష్ట్రం ఏమైనా కానీయండి.. నేను రాజకీయం చేస్తానని అంటే ఎలా అని ప్రశ్నించారు. మీరంతా రాష్ట్రంలో భాగస్వాములు అని.. అలాంటప్పుడు రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ ఎలా జరిగిందన్నారు.
రైతులను వైసిపి భయాందోళనకు గురి చేస్తోందన్నారు. ప్రతిపక్ష నేత నన్ను అన్నాడంటే వదిలేస్తామని, కానీ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
అసలు మీ నాయకుడికి ఇన్ సైడింగ్ ట్రేడింగ్ అంటే తెలుసా అని వైసిపి సభ్యులను ఉద్దేశించి అన్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటే తెలుసా అన్నారు. రాజధాని రాకుండా తగులబెట్టాలనుకున్నారన్నారు. కుట్రకు పాల్పడుతున్నారన్నారు. కుట్ర చేస్తున్నందున సిబిఐ విచారణ కాదు.. ఏ విచారణ వేయమన్నారు.
అన్యాయం దొరా: జగన్
జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబును చూస్తే నవ్వేస్తోందని, ఇన్ సైడ్ ట్రేడింగ్ కాదని, అది ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు. దాని గురించి తెలుసుకోవాలన్నారు. రైతుల భూములు తీసుకోవడం చాలా అన్యాయమైన విషయం దొరా అన్నారు.
మీ వాళ్లూ భూములు ఇచ్చారు: చంద్రబాబు
29 గ్రామాలలో ల్యాండ్ పూలింగుకు నోటిఫికేషన్ ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. పక్క గ్రామాల వారు కూడా భూమి ఇస్తామంటే వద్దని చెప్పామన్నారు. ఈ 29 గ్రామాల్లోని భూమి మొత్తం ప్రభుత్వానిదే అన్నారు. ఈ సందర్భంగా వైసిపి నేతలు ఇచ్చిన భూమిని చంద్రబాబు ప్రస్తావించారు.
అక్కడ మీ పార్టీకి కూడా ఓటు వేసిన వారు ఉన్నారని, వారికి కూడా అన్యాయం చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.