‘తెలంగాణ సక్సెస్ ఫార్ములా’: జగన్ వ్యూహాత్మక అడుగు, పవన్ పరిస్థితేంటి?, టీడీపీకి గట్టి షాక్!
నెల్లూరు/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. ఆయన తాజా ప్రకటన హోదా కోసం పోరాటం చేస్తున్నామంటున్న అధికార పార్టీతోపాటు ఇతర పార్టీలకు షాకిచ్చిందనే చెప్పాలి.
Recommended Video

రాజీనామా అస్త్రంగా చేసుకుని జగన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు హోదానే ఎజెండాగా జగన్ ముందుకెళ్లేందుకు సంకేతాలిచ్చినట్లు స్పష్టమవుతోంది.

రాజీనామాలే అస్త్రాలుగా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ రాజీనామా అస్త్రాలను ఉపయోగించి ప్రజల్లోకి సెంటిమెంటును బలంగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా ప్రత్యేక హోదా సెంటిమెంటును ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లేందుకు జగన్ తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

సక్సెస్ ఫార్ములా..
తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన ప్రతీసారి వచ్చిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. అదే రీతిలో హోదాను సెంటిమెంటుగా మలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు జగన్ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

తెలంగాణ ఫలితాలే..
ఒక వేళ జగన్ చెప్పినట్లుగానే ఏప్రిల్ 6న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసినట్లయితే.. జగన్ పార్టీకి ప్రజలతోపాటు ఇతర పార్టీల నేతలు కూడా మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడకతప్పదు. దీంతో హోదా సెంటిమెంటును ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఫలితాలనే జగన్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

ముందు జాగ్రత్త.. రామ బాణమే.. టీడీపీకి షాకే
కాగా, ఇప్పటి వరకు జగన్ తన ప్రతీ పర్యటనలోనూ ప్రత్యేక హోదాను ప్రస్తావిస్తూ అధికార పార్టీపై విమర్శల దాడి చేస్తున్నట్లు విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కళాశాలల్లో, బహిరంగ సభల్లో విద్యార్థులు, యువతకు ప్రత్యేక హోదాతో ఏపీకి చేకూరే ప్రయోజనాలను జగన్ వివరించారు. ఈ నేపథ్యంలో రాజీనామాలు తమకు రామ బాణంలా పనిచేస్తాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ ఎలాంటి పోరాటం చేయడం లేదని విమర్శలు చేస్తున్న అధికార టీడీపీకి.. వైయస్ జగన్ సంచలన నిర్ణయం షాకిచ్చిందనే చెప్పాలి.

జగన్ అనుకున్నట్లు జరిగితే..
కాగా, వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తే.. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఉప ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎంపీలు గెలిచినా.. ఊహించని విధంగా ఆ స్థానాల్లో టీడీపీ గెలిచినా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ ప్రభావం తీవ్రంగానే ఉండనుందని చెప్పవచ్చు. ఒక వేళ ఈ ఎన్నికల్లో తిరిగి వైసీపీ ఎంపీలు విజయం సాధిస్తే మాత్రం జగన్ అనుకున్నది దాదాపు సాధించినట్లేనని చెప్పవచ్చు.

తప్పని పరిస్థితుల్లో పవన్
ఇది ఇలావుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోదా కోసం రాజీనామా చేస్తామని జగన్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ వారికి తప్పని పరిస్థితుల్లో తన మద్దతు తెలపక తప్పదు.

అన్ని పార్టీలకు చెక్.. జగన్ అడుగు వ్యూహాత్మకమే..
ఒక వేళ పవన్.. ఈ విషయం(ఎంపీల రాజీనామా)లో జగన్ పార్టీకి మద్దతు తెలిపినట్లయితే.. వైసీపీకి కలిసివచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. అలాగే పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న అధికార టీడీపీని ఇరకాటంలో పడేసే అంశంగానూ మారనుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగన్ తీసుకున్ని ఈ రాజీనామా నిర్ణయం ఎంతో వ్యూహాత్మకంగానే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఏపీ ప్రజల్లో కూడా హోదా సెంటిమెంటు బలంగా ఉండటం.. జగన్ పార్టీకి సానుకూల ఫలితాలిస్తాయనడంలోనూ సందేహం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 6 తర్వాత ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications