నెల్లూరు జైలుకు జగన్ - ఓదార్పు మొదలు, నెక్స్ట్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. దాడులు జరిగిన కేడర్ కు అండగా నిలవాలని నిర్దేశించారు. తాను ప్రజల్లోకి వస్తానని వెల్లడించారు. ఇప్పుడు జిల్లాల పర్యటనకు జగన్ సిద్దం అవుతున్నారు. ముందుగా పార్టీ నేతలు..కేడర్ పరామర్శకు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తొలి పర్యటన ఖరారైంది.
నెల్లూరుకు జగన్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ గురువారం నెల్లూరు కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చనున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంటు, మహిళపై దాడి, కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు. మాచర్ల కోర్టు 14 రోజులు విధించి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా పిన్నెల్లిని పరామర్శించారు. ఇప్పుడు జగన్ నెల్లూరు జైలుకు రానున్నారు. పిన్నెల్లిని పరామర్శించనున్నారు.

పిన్నెల్లికి పరామర్శ
4వ తేదీన జగన్ 9.40 గంటలకు హెలికాప్టర్ లో నెల్లూరుకు వస్తారు జగన్. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్తారు. పోలింగ్ రోజు ఈవీఎంని ధ్వంసం చేసిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. ఆయన్ను పరామర్శించేందుకు జగన్ ఇప్పుడు నెల్లూరుకు వస్తుండటంతో స్థానిక నేతలు జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్టీ ప్రక్షాళన
పరామర్శ తరువాత జగన్ పార్టీ నేతలతో సమీక్ష ఏర్పాటు చేసారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా, ఈసారి ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు. తొలి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో భవిష్యత్ కార్యాచరణ జగన్ నేతలకు నిర్దేశించనున్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని..తరువాత ప్రజల తరపున పోరాటాలకు సిద్దం అవుదామని జగన్ ఇప్పటికే స్పష్టం చేసారు. ముందుగా పార్టీ ప్రక్షాళన..పదవుల్లో మార్పులు...కేడర్ తో మమేకం కావావాలని నిర్ణయించారు. వచ్చే వారం జగన్ పార్టీ కీలక సమావేశంలో తన కార్యాచరణ ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications