బాబు చెప్తే చేతులు పైకెత్తండి: జగన్ ఆగ్రహం, హోదా దీక్ష స్థలం ఖరారు
టంగుటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ప్రకాశం జిల్లా టంగుటూరులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు.
రైతులు దారుణ పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. గత ఏడాది పొగాకు ధర రూ.109 ఉంటే, ఇప్పుడు 90.95 పైసలు మాత్రమే ఉందన్నారు. జనవరిలో వేలం మొదలు పెట్టి జూన్ నెలలో ఆపేయాలన్నారు.
అడిగిన తెలుసుకున్న జగన్
తాము అధికారంలోకి వస్తే భేషరతు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారా? లేదా? అని ధర్నాకు హాజరైన వారిని ప్రశ్నించారు. రెండు చేతులు పైకి ఎత్తి చెప్పాలన్నారు. దానికి ధర్నాకు హాజరైన వారు చేతులు పైకెత్తి రుణాలు మాఫీ చేస్తామని చెప్పారన్నారు.
ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, మీకు రుణాలు మాఫీ చేశారా? అని ధర్నాకు హాజరైన వారిని అడిగారు. వారు మాఫీ చేయలేదని చెప్పారు. దీంతో, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహోద్రుడయ్యారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు చేయలేదని మండిపడ్డారు.
చంద్రబాబుకు అసలు బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉందా అని అడుగుతున్నానన్నారు. రైతులను ఆదుకునే బాధ్యత లేదా అని నిలదీశారు. త్వరలో కచ్చితంగా ఎన్నికలు వస్తాయని, అధికారంలోకి వస్తామని అభిప్రాయపడ్డారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదన్నారు. మరింత ఉద్యమం చేస్తామని, నష్టపోయినప్రతి రైతుకు లాభం జరిగేలా చూస్తామన్నారు. పొగాకు రైతు కష్టాలు సీఎంకు చీమకుట్టినట్లయినా లేదన్నారు.
ప్రత్యేక హోదా: జగన్ దీక్ష స్థలం ఖరారు
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైయస్ జగన్ తలపెట్టిన దీక్ష స్థలం ఖరారు అయింది. అక్టోబర్ 7వ తేదీన జగన్ హోదా కోసం నిరవధిక దీక్షను చేయనున్నారు. ఇందుకు గుంటూరు జిల్లాలోని నల్లపాడు రోడ్డు స్థలాన్ని ఖరారు చేశారు.