ఆదాయం ఇలా తీసుకురండి-అధికారుల్ని కోరిన సీఎం జగన్...
ఏపీలో వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో సంక్షేమం కోసం పెడుతున్న ఖర్చు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయం అవసరం కూడా అంతే స్ధాయిలో పెరుగుతోంది. దీంతో సీఎం జగన్ తరచుగా ఆదాయాన్ని అర్జించే శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే అధికారులకు కీలక సూచనలు కూడా చేస్తున్నారు. ఇవాళ మరోసారి ఆదాయార్జన శాఖలపై జగన్ కీలక సమీక్ష చేశారు.
ఇవాళ వాణిజ్య పన్నులశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో అధికారులు పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కలిగించాలని సీఎం జగన్ సూచించారు. ఏపీలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని జగన్ ఆదేశించారు. అవగాహన పెంచడం, వారి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం చేయాలన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందించినట్టు అవుతుందన్నారు.అలాగే ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.

అనంతరం ఎక్సైజ్ శాఖపైనా సీఎం జగన్ సమీక్ష చేశారు. గతంతో పోల్చి చూస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్ రూమ్లు రద్దు వంటి ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల అమ్మగాలు గణనీయంగా తగ్గాయని సీఎం తెలిపారు. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందని వెల్లడించారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్ఈబీ ప్రత్యేక దృష్టి సారించాలని జగన్ ఆదేశించారు.
వాటిని నివారించడానికి తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఎస్ఈబీలో పరివర్తన కార్యక్రమం జరుగుతున్న తీరుపై సీఎం వివరాలు తెలుసుకున్నారు. పరివర్తన కార్యక్రమంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఆరా తీసారు. చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలు ద్వారా వారికి ఊతమివ్వాలన్నారు. ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించాలని ఆదేశించారు. వారికి ఆదాయాలు వచ్చే దిశగా ఉపాధి ఉండాలన్నారు.
అప్పుడే మరలా అక్రమ మద్యం తయారీ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారన్నారు.
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖపైనా సీఎం జగన్ సమీక్ష చేశారు. శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాల్లో.. వార్డుల్లో...సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలని జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్ అందించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో...ఏయే రకాలడాక్యుమెంట్లు ను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న విషయాలపై ప్రజలకూ అర్ధమయ్యేలా వివరించాలన్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాను అప్గ్రేడ్ చేయాలన్నారు. అనంతరం మైనింగ్ శాఖపై సమీక్ష చేసిన జగన్...నాన్ ఆపరేషనల్ మైన్స్పై మరింత దృష్టి పెట్టాలన్నారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications