షాకింగ్: 'కేవీపీతో ఫోన్ టచ్లో వైయస్ జగన్, విజయసాయి ద్వారా లీక్'
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావుతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం నాడు నిప్పులు చెరిగారు.
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావుతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం నాడు నిప్పులు చెరిగారు.
కేవీపీ, జగన్ నిత్యం ఫోన్లో టచ్లో ఉన్నారని దేవినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే కుట్రలో ప్రధానపాత్రదారులు జగన్, కేవీపీ అని దుయ్యబట్టారు. వారిద్దరు నిత్యం టచ్లో ఉంటూ ప్రాజెక్టును అడ్డుకునేందుకు పక్క రాష్ట్రాల ఎంపీలకు విజయ సాయి రెడ్డి ద్వారా పోలవరం పనులు లీక్ ఇస్తున్నారని ఆరోపించారు.

జగన్ ఎన్ని కుట్రలు చేసినా పోలవరం ప్రాజెక్టును ఆపలేడన్నారు. ఈ ప్రాజెక్టు పనులను ఆగవని చెప్పారు. నెలకు ఓసారి రాష్ట్రానికి వచ్చి ధర్నాల పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల నాటికి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీలు కలిసిపోతాయన్నారు.
చంద్రబాబుపై బొత్స ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేశ్ రెడ్డి త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వైసిపి నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 16న నరసారావుపేటలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్నారు.
నరసారావుపేట సభను అడ్డుకునేందుకు కోడెల శివప్రసాద రావు కుటుంబం ప్రయత్నిస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు పేపర్ ప్రకటనలకే పరిమితం అని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ పైన వైసిపి ధర్నాలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు.












Click it and Unblock the Notifications