అప్పుడు రాజధాని భూములు, ఇప్పుడు పట్టిసీమ: పట్టు కోసం జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పార్టీ పట్టు కోల్పోకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇంతకు ముందు రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన జగన్ ఇప్పుడు ప్రాజెక్టుల యాత్ర చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆయన ప్రాజెక్టుల బస్సు యాత్ర చేశారు.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జగన్ తాజాగా ప్రాజెక్టుల బస్సు యాత్ర చేసినట్లు భావిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడం వల్లే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకొన్న ఫలితాలు సాధించలేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ జరిగిన సహకార సంఘాల ఎన్నికలలోనూ కాంగ్రెస్, టిడిపి తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఫలితాలకు కారణం బ్లాక్, బూత్, గ్రామ స్థాయిలో బలమైన పార్టీ క్యాడర్ లేకపోవడమే ఇందుకు కారణమని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి తన పార్టీని కాపాడుకుంటూ మరింత బలోపేతం అయ్యే ప్రయత్నంలో భాగంగా రైతు పరామర్శ యాత్రలు, రాజధాని నిర్మాణ ప్రాంతాల్లో వివాదాలుగా మారిన గ్రామాల పర్యటన తదితర కార్యక్రమాలకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. తాజాగా జగన్ బస్సు యాత్రం చేపట్టారు. ఈ బస్సు యాత్రకు మంచి స్పందన లభించిందనే ఉత్సాహంతో పార్టీ నాయకత్వం ఉంది.
దీక్షలు, ఆందోళనలు చేపడుతూనే జనంలోకి వెళ్లే పర్యటనలే మేలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పార్టీ ఏర్పాటుకు ముందు ఆ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేతగా ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ఓదార్పు యాత్రలే ఆయన్ని నాయకుడిగా నిలబెట్టాయి. పార్టీ ఏర్పాటు చేశాక జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ విజయఢంకా మోగించింది. కానీ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ అధికారాన్ని చేపట్టలేక ఏపిలో ప్రధాన ప్రతిపక్షంగా, తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
వైయస్ జగన్ ఇటీవల అనంతపురంలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. దాంతో ఆ జిల్లాలో మున్ముందు పార్టీ ఊపందుకొంటుందని ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఏ ప్రజా సమస్యపై ఆందోళనలు చేసినా అదే రీతిలో ఆ ప్రజా సమస్యలపై యాత్రలు, పర్యటనలు చేపట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications