జగన్ బాబాయి వివేకా హత్య: ట్విస్ట్ -ఎంపీ అవినాష్ రెడ్డి సిబ్బందితో సీబీఐ -సునీల్ యాదవ్ ఫ్యామిలీ భిన్నవాదన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, ఉమ్మడి రాష్ట్ర దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన రెండేళ్ల తర్వాతగానీ దర్యాప్తులో వేగం పుంజుకోలేదు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వివేకా హత్య కేసులో పలు మార్లు ఆగిన దర్యాప్తు గడిచిన నెలన్నరగా జోరందుకుంది. కీలక అనుమానితులను ఇప్పటికే అరెస్టు చేసిన సీబీఐ.. మరికొందరిని ప్రశ్నిస్తున్నది. ఆశ్చర్యకరంగా ఆ జాబితాలో వైఎస్ కుటుంబీకుడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సిబ్బంది కూడా ఉండటం గమనార్హం.

సీబీఐ దూకుడు..
వైఎస్ వివేకా హత్యోదంతం ఏపీలోనే ఖరీదైన నేరంగా, దీని వెనుక రూ.9 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా వార్తలు వస్తున్న క్రమంలో ఈ కేసుపై సీబీఐ మరింత పట్టుబిగించి దూకుడును ప్రదర్శిస్తున్నది. వివేకా ఇంటికి వాచ్మన్గా ఉన్న రంగయ్య వాంగ్మూలం తర్వాత వరుసగా అరెస్టులు, విచారణలు చేస్తోన్న సీబీఐ అధికారులు మంగళవారం నాడు పులివెందుల గెస్ట్హౌస్లో 8మందిని ప్రశ్నించారు. అందులో..

ఎంపీ అవినాష్ పీఏలు కూడా..
వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మంగళవారం పులివెందులలో ప్రశ్నించినవారిలో వైసీపీకి చెందిన ఎంపీ అవినాష్రెడ్డి వ్యక్తిగత సిబ్బంది రాఘవరెడ్డి, రమణారెడ్డి కూడా ఉన్నారు. వాళ్లతోపాటే హోంగార్డు నాగభూషణం, బాలకృష్ణారెడ్డి, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లి, సస్పెన్షన్లో ఉన్న సీఐ శంకరయ్యను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే విషయంపై సీబీఐ అధికారులు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.

ఆయుధాల కోసం కొనసాగుతోన్న వేట
సునీల్ కుమార్ యాదవ్ అరెస్టు తర్వాత కేసులో వేగం పుంజుకోగా, గత రెండు రోజులుగా వివేకాను హత్య చేయడానికి నిందితులు వాడిన మారణాయుధాల కోసం సీబీఐ అధికారులు అన్వేషిస్తున్నారు. కడప జిల్లా పులివెందులలోని రోటరీపురం వద్ద ఉన్న వాగులో మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కోసం ఉపయోగించిన మారణాయుధాల కోసం సీబీఐ అధికారులు అన్వేషించారు. ప్రోక్లైన్ సహాయంతో వాగులో ఉన్న బురదను తీసివేసి మారణాయుధాల కోసం శ్రమించారు మున్సిపల్ కార్మికులు. తవ్వేకొద్దీ వస్తున్న బురదతో మారణాయుధాల అన్వేషణ మరింత ఆలస్యమైంది.

రెండేళ్లుగా విచారణ ఆగుతూ సాగుతూ..
2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సిబిఐ అధికారులు సేకరించారు. 2019 మార్చి 20న వైఎస్ వివేకా కూతురు సునీత ప్రెస్ మీట్ పెట్టారు. విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పులివెందుల పోలీసులు 2019 మార్చి 28న ముగ్గుర్ని అరెస్టు చేశామని ప్రకటన చేశారు. అయితే, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని 28 జనవరి 2020లో వివేకా కూతురు సునీత పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని 2020 జనవరి 28న హైకోర్టు ప్రశ్నించింది. కాగా, 11 మార్చి 2020న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు అప్పగించింది. అప్పటి నుంచి పలు దఫాలుగా కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారిస్తోంది. ఇదిలా ఉంటే,

ఆ తొమ్మిది మంది ఎవరు?
తాజాగా వివేకానంద రెడ్డి వాచ్మన్ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.. పులివెందులతో 16 ఏళ్లు, వివేకా ఇంటితో 2 ఏళ్ల అనుబంధం ఉన్న వ్యక్తి. వివేకానంద రెడ్డి బతికి ఉండగా చూసిన ఆఖరి వ్యక్తి, మర్డర్కి గురైన తర్వాత చూసిన మొదటి వ్యక్తి కూడా రంగయ్యే. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు, మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాగ్మూలమే కేసులో హైలైట్. మొత్తం 9 కోట్ల సుపారీతో.. 9మంది ప్రమేయంతో వివేకా హత్య జరిగిందన్నది ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. ఆ తొమ్మిది మందిలో బయటపడ్డ మూడు పేర్లు.. ఒకటి ఎర్ర గంగిరెడ్డి, రెండు సునీల్ యాదవ్, మూడు దస్తగిరి. ఇంతకీ ఈ మూడు పేర్లు నిజమేనా? అయితే, మెజిస్ట్రేట్ ముందు వాగ్మూలం తర్వాత కూడా ఓసారి విచారించి ఇంటికి పంపిన సీబీఐ.. అతని ప్రాణానికి పూర్తి రక్షణ ఇస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. రంగయ్యలో మాత్రం భయం తగ్గినట్లు కనిపించడంలేదు. ఎర్రగంగిరెడ్డి పేరును ప్రధానంగా వినిపించిన ఆయన మెజిస్ట్రేట్ ముందు ఏం చెప్పారంటే మాత్రం ఒక్కోసారి ఆచితూచి స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

సునీల్ యాదవ్ కుటుంబం భిన్నవాదన..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సునీల్ కుమార్ యాదవ్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సునీల్కు ఏ పాపం తెలియదంటున్నారు. పులివెందులలో సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. సునీల్ యాదవ్ తల్లి మాట్లాడగా.. ''నా కుమారుడు సునీల్ యాదవ్ కు ఏ పాపం తెలియదు. విచారణ పేరుతో నా కొడుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. 24 గంటల్లో నా కొడుకు ఇంటికి రాకపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం.'' అని అన్నారు. ''వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు నా కొడుకు సునీల్ యాదవ్ ఇంట్లోనే ఉన్నాడు. హత్య జరిగిన తరువాత అందరిలాగా చూడడానికి మాత్రమే వెళ్ళాడు. వాస్తవామానికి మాపై ఆరోపణలు రావడంతో మనస్తాపానికి గురయ్యాం. కుటుంబం మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి గోవా వెళ్ళాం. అక్కడ చనిపోతే మా కుటుంబంపైనే నింద వస్తుందని తిరిగి పులివెందులకు వచ్చాం. వివేకానంద రెడ్డి మాకు దేవుడు లాంటివాడు. వివేకానంద రెడ్డితో నా కొడుకు సన్నిహితంగా మెలిగింది వాస్తవమే. వివేకానంద రెడ్డి మా ఇంటికి 2 సార్లు వచ్చి వెళ్ళారు. అటువంటి మంచి వ్యక్తిని సునీల్ హత్య చేశాడు అనడం అవాస్తవం. వాచ్మెన్ రంగయ్యను సీబీఐ అధికారులు బెదిరించి తప్పుడు సాక్ష్యాలు చెప్పించారు. రంగయ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. రెండున్నర సంవత్సరాలుగా నోరు విప్పని రంగయ్య ఈ రోజే ఎందుకు నోరు విప్పారు.'' అని ప్రశ్నలు గుప్పించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications