ఇదీ జగన్ ఆరోగ్య పరిస్థితి: భారతి-విజయమ్మ కన్నీరుమున్నీరు, సీబీఐ దర్యాఫ్తుకు కోర్టుకు వైసీపీ
హైదరాబాద్/విశాఖపట్నం/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాఖలో దాడి అనంతరం అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విమానంలో హైదరాబాద్కు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జగన్ ఎడమ భుజానికి తొమ్మిది కుట్లు పడినట్టు సిటీ న్యూరో సెంటర్ డాక్టర్లు ప్రకటించారు. దాదాపు మూడున్నర సెం.మీ. మేర కండరం లోపలకి కత్తి దిగిందని చెప్పారు. అత్యవసర విభాగంలో భుజం దగ్గర మత్తు ఇచ్చి తొమ్మిది కుట్లు వేశామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

విజయమ్మ కన్నీరుమున్నీరు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్ వద్ద తల్లి విజయమ్మ, భార్య భారతి వచ్చారు. తన కుమారుడు జగన్పై దాడి జరిగిన విషయం తెలిసి విజయమ్మ బెంగళూరు నుంచి హుటాహుటిన బయల్దేరి హైదరాబాద్ వచ్చారు. గాయాన్ని చూసి ఆమె కన్నీరుమున్నీరయ్యారు. చేయిపై మూడు నాలుగు సెంటీమీటర్ల గాయమైందని కండరం, 9 కుట్లు వేశామని వైద్యులు విజయమ్మకు చెప్పారు. వైద్యులు సూచించే వరకు ఆసుపత్రిలో ఉండాలని, అవసరమైతే పాదయాత్ర వాయిదా వేసుకోవాలని జగన్కు విజయమ్మ సూచించారని తెలుస్తోంది. అయితే అలాంటి ఆలోచన లేదని, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని జగన్ తన తల్లితో చెప్పారు.
Recommended Video


పరీక్షల అనంతరం డిశ్చార్జ్
జగన్పై జరిగిన దాడిలో కోడి పందేలకు వాడే కత్తిని వినియోగించడం వల్ల వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 25 రకాల పరీక్షలు చేసేందుకు రక్త నమూనాలు తీసుకున్నారు. వైద్య పరీక్షల నివేదికలు కొన్ని 24 గంటల్లో, మరికొన్ని 48 గంటల్లో వస్తాయి. అప్పటి దాకా జగన్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండే అవకాశముంది. రిపోర్ట్ వచ్చాక దానిని బట్టి ఆయనను డిశ్చార్జ్ చేస్తారు. జగన్ డిశ్చార్జ్ అయినా నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలుస్తోంది.

హైదరాబాదుకు విశాఖ పోలీసులు
వైయస్ జగన్ స్టేట్మెంట్ తీసుకోవడానికి విశాఖపట్నం పోలీసులు హైదరాబాద్ వచ్చారు. జగన్ హెల్త్ బులెటిన్ వచ్చాక, డాక్టర్ల సూచన మేరకు పోలీసులు ఆయన స్టేట్మెంట్ తీసుకోనున్నారు. రక్తనమూనా రిపోర్ట్స్ వచ్చాక డిశ్చార్జ్ చేసే అవకాశముంది.

జగన్ వద్దకు నేతల క్యూ
మరోవైపు, వైసీపీ నేతలు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారెడ్డి, రాజ్యసభ ఎంపీ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆసుపత్రికి వచ్చారు. ఆయన ఆరోగ్యంపై ఆఱా తీస్తున్నారు.

గవర్నర్ను కలవడం, సీబీఐ విచారణకు కోర్టుకు
గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నుంచి వచ్చాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను కలవనున్నారు. ఆయన అపాయింటుమెంట్ కోసం ఇప్పటికే అడిగినట్లుగా తెలుస్తోంది. అలాగే తమ పార్టీ అధినేత పైన జరిగిన దాడిని సీబీఐతో విచారించాలని వైసీపీ కోర్టును ఆశ్రయించనుందని తెలుస్తోంది. ఏపీ సిట్ పైన నమ్మకం లేదని, సీబీఐతో విచారిస్తే నిందితుడి వెనుక ఎవరున్నారో తేలుతుందని వారు కోర్టును కోరనున్నారు.












Click it and Unblock the Notifications