మణిపాల్ ఆస్పత్రికి జగన్-బెణికిన కాలుకు వైద్య పరీక్షలు-వైద్యంపై డాక్టర్ల నిర్ణయం
రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన నాటి నుంచి క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తాజాగా కాలు బెణికింది. ఉదయం వ్యాయామ సమయంలో కాలు బెణకడంతో డాక్టర్లు తాత్కాలిక చికిత్స అందించారు. కానీ పూర్తిగా నయం కాలేదు. దీంతో నొప్పితో బాధపడుతూనే రోజువారీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
గతంలో పాదయాత్ర సమయంలోనే కాలునొప్పి ప్రారంభమైందని, దానికి తోడు తాజా కాలు బెణుకుతో మరిన్ని ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయనికి సమీపంలోనే ఉన్న మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం మణిపాల్ ఆస్పత్రికి వెళ్లిన జగన్ కు వైద్యులు ప్రాధమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాలు బెణుకు తీవ్రత నేపథ్యంలో ఎక్స్ రే కానీ స్కానింగ్ కానీ తీస్తున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మిగతా పరీక్షలు కూడా నిర్వహించే అవకాశముంది.
కాలు బెణుకుతోనే రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నజగన్ తాజాగా నొప్పి మరింత పెరగడంతో మణిపాల్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇావాళ సీఎం జగన్ విద్యారంగంపై సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆ లోపే మణిపాల్ ఆస్పత్రికి వెళ్లడంతో జగన్ కాలు బెణుకుపై పార్టీతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మణిపాల్ ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు జగన్ కాలు బెణుకు అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది. సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి కొన్ని సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ కాలునొప్పిపై వివరాలు తెలుసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.