ఢిల్లీలో జగన్, ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్: అటు నుంచి నరుక్కొస్తారా?
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన కోసం వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ఆసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఊపందుకుంది. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న వైయస్ జగన్ ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు పార్టీ నేతల ద్వారా తెలుసుకుంటున్నారు.
ఈసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన న్యాయం చేయాలని కోరేందుకు ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్లను కలవనున్నారు. ప్రత్యేకహోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చిస్తారని సమాచారం.
దీంతో పాటు ఏపీలో తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను కూడా ఆయన వారికి వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరితే వారికి ఇచ్చే తాయిలాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు.
అదేవిధంగా, కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, వాళ్ల మనోభావాలు వివరించి.. తగిన న్యాయం చేయాలని కోరనున్నారు. తునిలో జరిగిన ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరనున్నారని తెలుస్తోంది.
అయితే ఫిరాయింపు రాజకీయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైయస్ జగన్ పర్యటనలో వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరే వారిలో కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి, కృష్ణా జిల్లా నుంచి జలీల్ ఖాన్, విజయనగరం జిల్లా నుంచి సుజయ కృష్ణ రంగారావు, ప్రకాశం జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు టిడిపిలో చేరే వారి జాబితాలో వినిపిస్తున్నాయి.
వైసీపీ నేతల చేరికతో ఏపీలో రాజకీయం ఊపందుకుంది. మరోవైపు, వైసిపి నేతల చేరికతో అసంతృప్తికి గురవుతున్న తమ పార్టీ నేతలను చంద్రబాబు, ఇతర నేతలు బుజ్జగిస్తున్నారు. భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్లు ఈ రోజు సాయంత్రం టిడిపిలో చేరనున్నారని తెలుస్తోంది.
కొన్ని ఛానళ్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి: వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొర
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొర ఖండించారు. కొన్ని ఛానళ్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ముమ్మాటికీ వైయస్ జగన్తోనే ఉంటామన్నారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే తెలుగుదేశం పార్టీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. అవినీతిని కప్పి పుంచేందుకే తెలుగుదేశం పార్టీ నేతలు ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
జగన్కు అపాయింటుమెంట్
వైసిపి అధినేత జగన్ ఢిల్లీలో ఓ రోజంతా ఖాళీగానే గడిపారు. తన బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసానికే పరిమితమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపుల కోసమంటూ ఢిల్లీకి వెళ్లిన జగన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్లతో భేటీ కావాలనుకున్నారు.
అయితే ఆయనకు ఏ ఒక్కరి అపాయింట్మెంట్ లభించలేదు. దీంతో ఆయన సోమవారం బాబాయ్ ఇంటికే పరిమితమయ్యారు. అయితే, మంగళవారం నాడు ఎట్టకేలకు రాష్ట్రపతితో అపాయింట్మెంట్ దొరికింది. ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్కు వెళ్లి, ప్రణబ్తో భేటీ కానున్నారు.