హోదాపై కేంద్రం ప్రకటన: జగన్ చేతికి అస్త్రం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతికి అస్త్రం దొరికినట్లయింది. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
'ఓసారి ప్రత్యేక హోదా కావాలంటారు. మరోసారి ప్రత్యేక హోదా ఏమైనా బ్రహ్మ పదార్థమా? అని అంటారు. మరోసారి కేంద్రంపై నమ్మకం ఉందంటారు. ప్రత్యేక హోదా లేకపోయినా.. కేంద్రం నిధులు మంజూరు చేసి రాష్ట్రాన్ని ఆదుకుంటుందని మరోసారి చెబుతారు'అని చంద్రబాబుపై జగన్ ధ్వజమెత్తిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇటీవల కేంద్రమంత్రి చౌదరి ఏపీకి హోదా అవసరం లేదని పార్లమెంటు సాక్షిగా చెప్పడంతో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేతగానితనం వల్లే ఏపీకీ హోదా రావడం లేదని ఆరోపించారు.
కాగా, తాజాగా, బుధవారం మరో కేంద్రమంత్రి జయంత్ సిన్హా కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఏపీకి అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి జగన్మోహన్ రెడ్డికి హోదా అస్త్రం లభించినట్లయింది.
చంద్రబాబుపై నిర్లక్ష్య దోరణి వల్లే హోదా రావడం లేదని ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో తప్పించుకునేందుకే కేంద్రంపై చంద్రబాబునాయుడు ఒత్తిడి చేయలేకపోతున్నాడని విమర్శలు చేశారు.
కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతున్న టిడిపి ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని, ఏపీ ఎంపీలందరూ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని గతంలోనే జగన్ డిమాండ్ చేశారు. తాజాగా కేంద్రం ప్రకటనపై మరోసారి చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకుని జగన్ తన పోరాటం సాగించే అవకాశాలున్నాయి.

వెంకయ్య, చంద్రబాబు మోసం చేస్తున్నారు: అంబటి
బిజెపి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని నమ్మించి అధికారంలోకి వచ్చాక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ మాటే మర్చిపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదని అన్నారు.
అంతేగాక, ప్రత్యేక హోదాతో పెద్దగా ఒరిగేది లేదని చాలాసార్లు చెప్పారని అంబటి అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా చూడాలని అన్నారు.ప్రజలను మోసం చేయాలని వైఖరిని మార్చుకోవాలని అన్నారు.
వెంకయ్య, చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అదేదో బ్రహ్మ పదార్థం కాదని అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మరో నేత వాసిరెడ్డి పద్మ కూడా హోదా విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఒత్తిడి చేయకపోవడం వల్లే హోదా రాకుండా పోతోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications