మెటా-రిలయన్స్ అతి భారీ డేటా సెంటర్: ఆ లొకేషన్ లో..
భారత్ లో మరో డేటా సెంటర్ రాబోతోంది. గౌతమ్ అదాని-గూగుల్ డేటా సెంటర్ మన విశాఖపట్నంలో స్థాపన కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖేష్ అంబానీ సారథ్యంలో మరొకటి ఏర్పాటు కాబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- సోషల్ మీడియా దిగ్గజం మెటా జాయింట్ గా దీన్ని నెలకొల్పబోతోన్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఖరారయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ వద్ద జాయింట్ వెంచర్ గా ఈ నూతన డేటా సెంటర్ పురుడుపోసుకోనుంది.
దీనిపై మెటా చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో అతి భారీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గుజరాత్లోని జామ్నగర్లో నిర్మించనున్న ఈ అత్యాధునిక కేంద్రాన్ని దాదాపు ఒక గిగావాట్ (GW) పునరుత్పాదక ఇంధనంతో నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. భారత్లో పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల వ్యవస్థలో ఇది ఒక కీలకమైన పరిణామంగా నిలుస్తుందని అభివర్ణించారు.

ఈ డేటా సెంటర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడి పనిచేస్తుంది. కూలింగ్ వ్యవస్థ కోసం సముద్రపు నీటిని శుద్ధి చేసే (Desalination) పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఇంధనం, నీటి వినియోగం తదితర ఖర్చులను మెటా సంస్థే భరిస్తుంది. భారత్ లో మెటా తన డిజిటల్ కార్యకలాపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను విస్తరించడంలో భాగంగా రిలయన్స్ జామ్నగర్ కేంద్రాన్ని లీజుకు తీసుకోనుంది.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన దాదాపు ఒక గిగావాట్ క్లీన్ ఎనర్జీని సమకూర్చుకునేందుకు మెటా ఇప్పటికే వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా రాజస్థాన్, కర్ణాటకలలో క్లీన్మాక్స్ (CleanMax) సంస్థ నిర్మిస్తున్న సోలార్, విండ్ ప్రాజెక్టుల ద్వారా 837 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. తాజా ఒప్పందంతో.. క్లీన్మాక్స్తో మెటా చేసుకున్న మొత్తం పునరుత్పాదక ఇంధన ఒప్పందాల సామర్థ్యం 900 మెగావాట్లను దాటింది.
భారత డిజిటల్ మౌలిక సదుపాయాల ఆశయాల్లో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయి అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థ కోసం భారత్లో ఇలాంటి కస్టమ్-బిల్ట్ ఏఐ డేటా సెంటర్ నిర్మించడం, భారత్ ను గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మార్చగలదని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యాధునిక ఏఐ అప్లికేషన్లకు మద్దతు ఇచ్చేలా తదుపరి తరం మౌలిక వసతులను నిర్మించడంపై రిలయన్స్ దృష్టి సారిస్తోందని అంబానీ స్పష్టం చేశారు.
రిలయన్స్- మెటా మధ్య భాగస్వామ్యం 2020లో ప్రారంభమైంది. ఆ ఏడాది జియో ప్లాట్ఫారమ్స్లో మెటా 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇది భారత టెక్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది. అప్పటి నుండి ఇరు సంస్థలు కలిసి ఇండియన్ ఎంటర్ప్రైజెస్, డెవలపర్ల కోసం మెటా ఓపెన్-సోర్స్ ఆర్టిఫీషియల్ మోడళ్లను అందుబాటులోకి తేవడం వంటి కీలక కార్యక్రమాలను చేపట్టాయి.
తాజా ఒప్పందంతో వీరి భాగస్వామ్యం డిజిటల్ సేవలు, సాఫ్ట్వేర్ స్థాయిని దాటి, భౌతిక మౌలిక సదుపాయాల (Physical Infrastructure) రంగంలోకి విస్తరించింది. జామ్నగర్లోని ఈ డేటా సెంటర్ మెటా యొక్క భవిష్యత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ డిజిటల్ మార్కెట్లో సంస్థ ఉనికిని మరింత బలోపేతం చేయనుంది.












Click it and Unblock the Notifications