సిపిఎం దూరమే: ఒంటరిగానే జగన్, జాబితా రెడీ
హైదరాబాద్: సీమాంధ్రలో సిపిఎంతో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. ఒంటరిగానే పోటీ చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీమాంధ్ర ఎన్నికల్లో పోటీకి దించే అభ్యర్థుల జాబితాను కూడా దాదాపుగా ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
మూడు రోజుల పాటు సీమాంధ్ర ప్రాంతంలోని జిల్లాల నేతలతో లోటస్పాండ్లో చర్చించిన పార్టీ అధ్యక్షుడు జగన్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో 13 జిల్లాలకు సంబంధించి సుమారు 100 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిసింది. విషయం బయటకు రాకుండా అధ్యక్షుడు జాగ్రత్తగా ఏ జిల్లా నేతలతో ఆ జిల్లా గురించి చర్చిస్తున్నారు.

సమైక్యవాదంలో తాము ముందున్నామని భావిస్తున్న జగన్ అదే విధానాన్ని మొదటి నుంచి అవలంబిస్తున్న సిపిఎంతో పొత్తు పెట్టుకుంటారని భావిస్తూ వచ్చారు. అయితే సిపిఎంతో పొత్తుకు వైయస్సార్ కాంగ్రెసు శ్రేణులు సముఖంగా లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని స్థానాలకూ ఒంటరిగా బరిలో దిగాలని, తెలంగాణలో సైతం ఒంటరి పోరుకే వెళుతున్నామని నేతలు చెబుతున్నారు.
సిపిఎం ఎక్కువ అసెంబ్లీ సీట్ల కోసం పట్టుబట్టడంతోపాటు ఖమ్మం పార్లమెంటు సీటు విషయంలో తేడాలొచ్చాయని తెలుస్తోంది. పోలవరం విషయంలో సిపిఎం వైఖరి సీమాంధ్ర ప్రాంతంలో ఓట్లకు గండికొడుతుందనే జగన్ వెనకడుగు వేశారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే పార్లమెంటు స్థానాల్లో ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు.
కాగా, సిపిఎం సిపిఐతో కలిసి నడవడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. తెలంగాణలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సీట్ల అవగాహన కుదుర్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. సిపిఐ, సిపిఎం కలిసి తెరాసతో తెలంగాణలో నడిచే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications