ప్లీజ్! వినండి, నేను చాలా బాధపడ్డా, రూ.1లక్షా 22వేల కోట్లు ఇవ్వండి: బాబుకు జగన్
గుంటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి అధినేత వైయస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం విమర్శలు గుప్పించారు. జగన్కు గుర్తుకు వస్తే దీక్షలు చేయడం, ఖాళీగా ఉంటే లేఖలు రాయడంమినహా మరో పనిలేకుండా పోయిందన్నారు.
జగన్ రాసిన లేఖల్లో ఒక్కటి కూడా వాస్తవమైనది లేదన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లను తమ ప్రభుత్వం కేటాయించిందని కొల్లు గుర్తు చేశారు.
జగన్ ఆరోపణలపై కొల్లు కౌంటర్
కానీ, నిరుద్యోగులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేయడం లేదని ఆరోపిస్తూ జగన్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నవ్యాంధ్రకు ఐటీ కంపెనీలను తీసుకువచ్చామని, మూడేళ్లలో 3.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.
ప్లీజ్! గోడు వినండి: బాబుకు జగన్
కాగా, శనివారం జగన్ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. నిరుద్యోగుల గోడు వినేందుకు తీరిక చేసుకోవాలని, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని చంద్రబాబును జగన్ విజ్ఞప్తి చేశారు.
ఇంటికో ఉద్యోగం లభించేంతవరకూ రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తామని 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు ఎక్కడ అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.
వీరందరి ఉద్యోగం ఊడింది
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోగా చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆరు వేల మంది ఆదర్శ రైతులను, 1500 మంది గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్లను, గ్రామీణాభివృద్ధిశాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న 2016 మందిని, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులుగా పని చేస్తున్న 4వేల మందిని, ఆయుష్లో 800 మందిని, 1900 మంది ఆరోగ్యమిత్రలను ఉద్యోగాల నుంచి తొలగించారని లేఖలో పేర్కొన్నారు.
అందుకే మళ్లీ రాస్తున్నా
చంద్రబాబు బాబు వచ్చారు.. జాబు పోయింది.. అని వారి కుటుంబాలన్నీ విలవిల్లాడుతున్నాయి జగన్ పేర్కొన్నారు. కనీస మానవత్వం లేదా అని విమర్శించారు. నిరుద్యోగ భృతిపై ఫిబ్రవరి 22న మీకు బహిరంగ లేఖ రాశానని, మీ ప్రభుత్వంలో చలనం లేదని, అందువల్లే మరోసారి రాస్తున్నానని చెప్పారు.
రూ.1.22 లక్షల కోట్లు వెంటనే చెల్లించాలి
సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోందని, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని జగన్ అన్నారు. 35 నెలలకు కలిపి ఒక్కో ఇంటికి రూ.70వేల భృతి బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు 1.75 కోట్ల కుటుంబాలకు కుల మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా మొత్తం రూ.1లక్షా 22వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.
నన్ను చాలా బాధించింది
మీ ఆధ్వర్యంలోని ఏపీపీఎస్సీ అధికారులు నిరుద్యోగుల గోడునుపట్టించుకునే పరిస్థితుల్లో లేరని జగన్ విమర్శించారు. గ్రూప్-2 అభ్యర్థులు ఏం చెబుతున్నారన్నది వినిపించుకునేందుకు మీ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం నన్ను చాలా బాధించిందన్నారు.
రాష్ట్ర విభజన జరిగే నాటికి ఏపీలో ప్రభుత్వ శాఖల్లో వివిధస్థాయిల్లో 1,42,828 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీపై మీ ప్రభుత్వ విధానమేంటన్న నిరుద్యోగుల ప్రశ్నకు మూడేళ్లుగా మీ నుంచి సమాధానం లేదని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.